ఎంత అరిచినా ప్రధాని కావాలని లేదు, అప్పుడే మీకు విశ్రాంతి: టీ మహానాడులో చంద్రబాబు పిలుపు
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తామేనని చంద్రబాబు అన్నారు. హైటెక్ సిటీ కట్టి ప్రపంచానికి హైదరాబాద్ ఎంటో చూపించామని అన్నారు. హైదరాబాద్ను మహానగరంగా చేశామని చెప్పారు. ఏపీకి వెళ్లినందుకు తనకు బాధ లేదని, ఇక్కడి అభివృద్ధి చేశామని, ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
హైదరాబాద్ తోపాటు తెలంగాణను కూడా అన్ని రంగాల్లో అభివృద్ది చేసింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఏపీ, తెలంగాణలు అభివృద్ధిలో ముందుండాలని అన్నారు. కొండవీటి సింహాల్లా, బెబ్బులి పులిలా పనిచేయాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు. 14ఏళ్లపాటు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ ఏమీ చేయలేదని అన్నారు. తెలంగాణలో టీడీపీ నుంచి నాయకులు పోయారు గానీ, కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని చంద్రబాబు అన్నారు.
కేంద్రం మోసం
టీడీపీ పుట్టింది హైదరాబాద్ నగరంలోనేని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా ఇక్కడేనని చంద్రబాబు తెలిపారు. అలాంటి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రం నమ్మక ద్రోహం చేసిందన్నారు. తెలంగాణలో పొత్తులేదని, ఏపీలో మాత్రం తమతో బీజేపీ పొత్తు పెట్టుకుందని అన్నారు. ఏపీలో తమతో పొత్తు పెట్టుకుని బీజేపీ దెబ్బతీసిందని అన్నారు. ఏపీకి, తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని చంద్రబాబు అన్నారు. విభజన హామీల్లో ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, తదితర హామీలను నెరవేర్చలేదని అన్నారు. తెలుగువాళ్లంటే కేంద్రానికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు.
ఇదేం పాలన
పటేల్ విగ్రహానికి 3వేల కోట్లు, శివాజీ, ఇతర విగ్రహాలకు నిధులు కేటాయిస్తున్న కేంద్రం.. ఏపీ, తెలంగాణలకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాద్, అమరావతికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు. నోట్ల రద్దుతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఏం పరిపాలన ఇదంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. బ్యాంకులు దివాలా తీస్తున్నాయని, మోసం చేసిన వారు విదేశాలకు పారిపోతున్నారని అన్నారు.
అన్యాయం చేయడంతోనే..
జీఎస్టీ సరిగ్గా అమలు చేయడం లేదని చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని అన్నారు. ట్రిపులు తలాఖ్ రద్దు చేసి, క్రిమినల్ కేసులు ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. కేంద్రం ఐదో బడ్జెట్లోనూ ఏపీకి అన్యాయం చేయడంతో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని చంద్రబాబు చెప్పారు. ఆ వెంటనే అవిశ్వాసం పెట్టామని, అందరి నుంచి మద్దతు లభించిందని అన్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పెట్టి, అప్పుడు ప్రధాని ఎన్నికలో కీలకంగా వ్యవహరించారని, 34సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అప్పుడు బీజేపీకి 2 సీట్లు వచ్చాయని, వరంగల్లో జంగారెడ్డి గెలిచారని అన్నారు.
ప్రధాని కావాలని లేదు
జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నందుకే ఆయన ఆహ్వానం మేరకు తాను బెంగళూరుకు వెళ్లానని చంద్రబాబు చెప్పారు. గతంలో నేషనల్ ఫ్రంట్ పెట్టి దేవెగౌడను ప్రధాని చేయడంలో తానే కీలకంగా వ్యవహరించానని బాబు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా అప్పుడే పనిచేశామని చెప్పారు. 2019 తర్వాత రాజకయాల్లో మార్పు వస్తుందని, మళ్లీ టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు తెలిపారు. తనకు ప్రధాని కావాలని లేదని.. నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వారించారు. మీరెంత అరిచినా నాకు ఆ కోరిక పుట్టదని అన్నారు. తనకు రెండుసార్లు ప్రధాని పదవి పొందే అవకాశం వచ్చిందని, కానీ, వద్దని చెప్పానని చంద్రబాబు తెలిపారు. తెలువారికి సేవ చేసే భాగ్యం శాశ్వతంగా ఉంటే చాలని అన్నారు.
కేసుల పార్టీతో ముందుకు వెళ్తున్నారు
తెలంగాణలో పార్టీని కాపాడుకుంటామని, అలాగే ఏపీలో ప్రభుత్వాన్ని నడిపిస్తామని చంద్రబాబు చెప్పారు. తెలుగుజాతికి న్యాయం కోసమే కర్ణాటకకు వెళ్లానని తెలిపారు. బీజేపీ గాలి జనార్ధన్ రెడ్డి మద్దతు తీసుకుందని, ఇప్పుడు అవినీతి పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ కలిసి వెళ్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాను ప్రజల కోసం పనిచేస్తానని, వైసీపీ మాత్రం కేసుల కోసం పనిచేస్తోందని అన్నారు. దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడ్ని అని, 40ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. నాలెడ్జ్ అకాడమిక్ ఫౌండేషన్ వేయడంతోనే మెట్పల్లి వాసికి సివిల్స్లో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని, శ్రీకాకుళం వ్యక్తికి జేఈఈలో నెం.1కి వచ్చిందని అన్నారు. తమ పార్టీ జోలికొస్తే కరెంటు షాక్ కొడుతుందని ఇతర పార్టీలను హెచ్చరించారు.
అప్పటి వరకు విశ్రాంతి లేదు
సంవత్సరంపాటు పార్టీ కోసం పనిచేస్తామని ఇంట్లో చెప్పేయండని, కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగించండని, టీడీపీ జెండా రెపరెపలాడిన తర్వాతే విశ్రాంతి తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త మరో 100మందిని తయారు చేయాలని అన్నారు. ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.