2020 వరకు ఖాళీ లేదన్న మంత్రికి కోమటిరెడ్డి కౌంటర్, పీఏసీ రేసులో అరుణ
హైదరాబాద్: తాను అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మాజీ మంత్రి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి సోదరులు తెరాసలో చేరేందుకు ప్రయత్నించారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి రెండు రోజుల క్రితం చెప్పారు.
దీనిపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. తాను, తన సోదరుడు తెరాసలో చేరాలనుకోలేదని, చేరమని చెప్పారు.
అంతకుముందు రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సోదరులు తెరాసలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వాటిని తాము తిరస్కరించామన్నారు. వారు తమ పార్టీలో చేరేందుకు ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అయితే వారిని తాము తీసుకునే అవకాశమే లేదని చెప్పారు. 2020 వరకు వాళ్లను తాము తీసుకోమని చెప్పారు. ఇటీవల పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి వాళ్లకు దక్కిన టెండర్లు సాంకేతికకంగా వచ్చినవేనని చెప్పారు. వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చన్నారు.
పీఏసీ చైర్మన్ పదవి రేసులో జీవన్ రెడ్డి, గీతా రెడ్డి
పీఏసీ చైర్మన్ పదవి రేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, గీతా రెడ్డిలు ఉన్నారు. పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పదవి ఇటీవల ఖాళీ అయింది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి ఆకస్మిక మరణంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. అంతకుముందు నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పీఏసీ చైర్మన్గా వ్యవహరించారు.
ఆయన మరణంతో రాంరెడ్డి వెంకట రెడ్డి చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఇటీవల మృతి చెందారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి ఎన్నిక అనివార్యమైంది. రేసులో జీవన్ రెడ్డి, గీతారెడ్డితో పాటు గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ కూడా ఉన్నారని తెలుస్తోంది.