నేను బాబుకు మాత్రమే వ్యతిరేకిని.. టీడీపీకి కాదు..! ఎన్టీఆర్ ఘాట్ లో లక్ష్మీపార్వతికి చేదు అనుభవం..!!
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ పాలన సాగించిన నందమూరి తారకరామారావు ఎప్పటికీ చిరస్మరణీయుడే. తెలుగువారు 'అన్నగారు' అని అభిమానంతో పిలుచుకునేది ఎన్టీఆర్నే. నేడు ఎన్టీఆర్ 97వ జయంతి.. ఈ సందర్భంగా వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు.
మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి కూడా అన్నగారికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు.
కనీసం స్వర్గీయ నందమూరి తారకరామారావు సంబందించిన ఒక్క బ్యానర్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని లక్ష్మీపార్వతి ఆగ్రహించారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు కుట్రల వల్ల తగిన శాస్తి జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి తానెప్పుడు వ్యతిరేకం కాదని.. చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రమే వ్యతిరేకమన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ.. ఏపీకి కాబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుతారని తనకు నమ్మకం ఉందన్నారు. కాగా.. లక్ష్మీపార్వతి మాట్లాడుతుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. లక్ష్మీపార్వతి గో బ్యాక్ అంటే నినాదాలు చేసారు. దీంతో లక్ష్మీపార్వతి పూర్తిగా మాట్లడకుడా అక్కడ నుండి వెనుదిరిగారు.