నేను టిఆర్ఎస్లో చేరితే హరీష్ రావు ఖేల్ ఖతం, తప్పుచేశా: జగ్గారెడ్డి
మెదక్: సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, దీనిని దెబ్బతీయడం మంత్రి హరీష్ రావు తరం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి శనివారం నాడు అన్నారు. గత కొంతకాలంగా తాను తెరాసలో చేరుతాననే ఊహాగానాలు వస్తున్నాయన్నారు.
నేను టిఆర్ఎస్ పార్టీలో చేరితే హరీష్ రావు ఆటలు ఆగిపోతాయని, ఆయన పని ఖతమవుతుందన్నారు. తెరాసలో చేరితే చౌకీదారుగా మారిపోయినట్లేనని ఎద్దేవా చేశారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారమంతా కావాలని చేస్తున్నదే అన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీని వదిలి తాను బిజెపిలే చేరి, అతిపెద్ద తప్పు చేశానని వ్యాఖ్యానించారు. ఇక పై ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని చెప్పారు. అధికార టిఆర్ఎస్ ప్రలోభాలు, బెదింపులతో ప్రతిపక్షంలోని వారిని పార్టీలో చేర్చుకుంటోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెసు పార్టీకి చెందిన సంగారెడ్డి పురపాలక సంఘం ఛైర్పర్సన్, ఉపాధ్యక్షుడు సహా పలువురు కౌన్సిలర్లు శనివారం టిఆర్ఎస్ పార్టీలో చేరడంపై ఆయన ధ్వజమెత్తారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, దీన్ని దెబ్బతీయడం మంత్రి హరీశ్ రావు తరం కాదన్నారు.
తానూ తెరాసలోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే ఓసారి బిజెపిలోకి వెళ్లి తప్పు చేశానని, ఇక కాంగ్రెస్ పార్టీని వీడనన్నారు. ఒకవేళ తాను తెరాసలోకి వెళ్తే వెళితే అందులో హరీశ్ రావు ఉండరని చెప్పడం గమనార్హం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, వందమంది హరీష్ రావులు వచ్చిన సంగారెడ్డిలో తనదే గెలుపన్నారు.