భార్యను ఒప్పించి మరీ.. ఈ నిర్ణయం తీసుకున్నా : ఉత్తమ్ సంచలన కామెంట్స్
హైదరాబాద్ : సాధారణంగా.. ఓ ప్రాజెక్టుకు కమిట్ అయ్యాక.. దాన్ని పూర్తి చేసేంతవరకు గడ్డంతోనే దర్శనమిచ్చే ట్రెండ్ ను ప్రస్తుతం సినిమా దర్శకుల విషయంలో కనిపిస్తోంది. కానీ పరిస్థితి చూస్తోంటే.. ఇప్పుడా ప్రభావం రాజకీయాలపై కూడా పడిందేమోనన్న అనుమానం కలగకమానదు. ఏపీలో సతీష్ రెడ్డి లాంటి నేతలు, తెలంగాణలో ఉత్తమ్ కుమార్ లాంటి నేతలు చేస్తోన్న గడ్డం శపథాలు చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది.
ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఈమధ్య గుబురు గడ్డంతో కనిపిస్తోన్న విషయం తెలిసిందే. అదేంటి.. ఉన్నట్టుండి ఉత్తమ్ ఇలా గడ్డం పెంచేస్తున్నారేంటి? అన్న సందేహం.. ఆయన్నలా చూశాక ప్రతి ఒక్కరికి కలిగింది. ఇప్పుడిదే విషయంపై స్పష్టత ఇస్తూ.. అసలు తానెందుకు గడ్డం పెంచుతున్నానో చెప్పుకొచ్చారు ఉత్తమ్.
ఇంతకీ ఏంటా గడ్డం కథ అంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేంతవరకు తాను గడ్డం తీయబోనని ఓ సంచలన శపథం చేసేశారు ఉత్తమ్. తన భార్య, నల్గొండ ఎమ్మెల్యే అయిన పద్మావతి ఇందుకు ఒప్పుకోకపోయినా.. ఆమెను ఒప్పించి మరీ.. గడ్డం శపథం చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని భీష్మించుకు కూర్చున్నారు. ఈ మాటలన్ని స్వయంగా ఆయన చెప్పినవే. 2019లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటోన్న ఉత్తమ్.. పార్టీ నేతలకు సానుకూల సంకేతాలు పంపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు.
ఉత్తమ్ కుమార్ గడ్డం శపథంపై పలువురు పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. గడ్డం శపథం సరే.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అయ్యే పనేనా అనేవారు లేకపోలేదు. ఇకపోతే ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి కూడా గతంలో గడ్డం శపథాలు చేశారు. గండికోట రిజర్వాయర్ ను పూర్తి చేసి కడపకు నీళ్లు తీసుకొచ్చేవరకు గడ్డం తీసేది లేదని సతీష్ రెడ్డి అప్పట్లో శపథం చేశారు. ఆ పనులు ఇప్పటికీ.. పూర్తయిన దాఖలా లేదు. మరి ఇప్పుడు ఉత్తమ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో!