కేసీఆర్ మాట్లాడితేనే స్పందిస్తా.. మంత్రుల స్థాయికి నేను అవసరం లేదు: జానారెడ్డి
నల్గొండ: జిల్లాలో కాంగ్రెస్ నాయకులు గనుక గెలిస్తే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. ఆయన వ్యాఖ్యలను పట్టించుకోనని, నా స్థాయికి మంత్రులకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకే తాను స్పందిస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నిడమనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారం ఉందన్న అహంతో మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచేది ప్రజలే తేలుస్తారని అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలన కేవలం మాటలకే పరిమితమైందని, మాటల ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. మిషన్ భగీరథ గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నారని, కానీ ఒక్క బోరు వేసి నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. విద్యుత్, ప్రాజెక్టులు, సాగునీటి గురించి ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు అందులో వారి ఘనత ఏమి లేదని అన్నారు.
ఓవైపు రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉందని చెబుతూనే.. మరోవైపు అప్పుల భారంతో రాష్ట్రాన్ని అథోగతి పాలు పట్టించారని జానారెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామిలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు.