అన్నీ మరిచి, చదువు పైనే దృష్టి: ఆఫ్రికా స్త్రీ సింథియా కూతురు
హైదరాబాద్: జరిగిందంతా తాను మర్చిపోవాలనుకుంటున్నానని, ఇక నేను నా చదువుల పైన దృష్టి సారిస్తానని రూపేష్ - సింథియాల కూతురు సానియా చెప్పారు. ఆఫ్రికాకు చెందిన తన భార్య సింథియాను రూపేష్ కొద్ది రోజుల క్రితం చంపేసి, ముక్కలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో రూపేష్ను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుంటున్నారు. ఓ వైపు తండ్రి రూపేష్ అరెస్ట్, తల్లి సింథియా హత్య నేపథ్యంలో సానియా భవితవ్యం గందరగోళంగా మారింది.
మంగళవారం నాడు చైల్డ్ వెల్భేర్ కమిటీ అధికారులు ఎనిమిదేళ్ల బాలిక సానియాతో మాట్లాడారు. ఆమె ఎవరితో ఉండాలనుకుంటుందో తెలుసుకున్నారు. అంతేకాదు, బాలికతో ఇటు తల్లి, అటు తండ్రి కుటుంబ సభ్యులు ఉండేందుకు కమిటీ సభ్యులు అనుమతించారు. మరోవైపు, సానియాకు డీఎన్ఏ పరీక్షలకు కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం సానియా హైదర్షాకోట్లోని కస్తుర్బా హోంలో ఉంది.
పాపతో మాట్లాడిన అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఆ పాప ఇప్పుడు జరిగినదంతా మరిచిపోయే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆమె తన స్కూల్ను తిరిగి ప్రారంభించాలనుకుంటుందన్నారు.
సానియాను ప్రశాంత, భద్రత ప్రాంతంలోకి తరలించాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆమెను పబ్లిక్ దృష్టి నుంచి మరల్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆమె ఉండేందుకు కొత్త ప్రాంతాన్ని చూస్తున్నట్లు తెలిపారు. ఆమె నిత్యం స్కూల్కు వెళ్లేలా చూడాలన్నారు.
సానియా తన బంధువులతో తక్కువ సమయం గడుపుతోంది. స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడుతోంది. ఈ నెల 15వ తేదీన ఆమెకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, రూపేష్ను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుంటున్నారు. ఆయనను విచారించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. ఈ కేసును సీసీఎస్ మాధాపూర్ టీం విచారణ చేస్తోంది.
హత్యలో రూపేష్కు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారించనున్నారని తెలుస్తోంది. ఎన్ని రోజుల ముందు నుంచి ఆయన హత్యకు ప్లాన్ చేశారనే విషయాన్ని కూడా తెలుసుకోనున్నారు. రూపేష్ను విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టాలని రంగారెడ్డి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.