సంధ్యారాణితో ఐదేళ్ల ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే..: కార్తీక్, ‘అవారా’ అన్న డీసీపీ
Recommended Video
హైదరాబాద్: తనను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతోనే సంధ్యరాణిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశానని నిందితుడు కార్తీక్ తెలిపాడు. గురువారం సాయంత్రం ఇంటికి వెళుతున్న సంధ్యారాణిపై కార్తీక్ పెట్రోలు పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే.
నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కార్తీక్: ఆస్పత్రిలో సంధ్యారాణి మృతి, 'ప్రేమ వేధింపులు'
తీవ్రగాయాలపాలైన సంధ్యారాణి శుక్రవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కాగా, సంధ్యారాణికి నిప్పంటించిన తర్వాత నిందితుడు కార్తీక్ లాలాగూడ పోలీసులకు లొంగిపోయాడు.
ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం
తాను, సంధ్యారాణి ఐదేళ్లుగా ప్రేమించుకున్నామని కార్తీక్ తెలిపాడు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నామని తెలిపాడు. సంధ్యారాణి కూడా తను చేస్తున్న కంపెనీలోనే పనిచేసేదని చెప్పాడు.
బాధ్యత ఉండమన్న సంధ్యా రాణి
కాగా, కొంత కాలం క్రితం కార్తీక్ తన ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత చెడు తిరుగుళ్లకు ఆలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే సంధ్యారాణి ఏదైనా ఉద్యోగం చేయాలని, బాధ్యతగా ఉండాలని కార్తీక్కు చెప్పింది. అప్పుడే పెళ్లి గురించి ఆలోచిద్దామని స్పష్టం చేసింది.
అయినా, తీరు మార్చుకోని కార్తీక్.. పెళ్లి చేసుకోవాలంటూ సంధ్యారాణి వెంటపడ్డాడు.
సంధ్యారాణిని బతిమాలా.. కానీ.. అందుకే
ముందేమో పెళ్ళి చేసుకుందామన్న సంధ్యారాణి.. ఇప్పుడు మాత్రం ఒప్పుకోలేదని కార్తీక్ తెలిపాడు. గురువారం సాయంత్రం కూడా తాను సంధ్యారాణిని పెళ్లి చేసుకోవాలంటూ బతిమాలానని కార్తీక్ చెప్పాడు. ఐనా నిరాకరించడంతో సంధ్యారాణిపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు కార్తీక్ తెలిపాడు. ఆ తర్వాత తాను పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపాడు.
కార్తీక్ చెల్లెలు స్నేహితురాలే సంధ్యా రాణి
తమకు తెలిసిన కార్తీక్.. ఇంతటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని అతడి స్నేహితులు చెబుతున్నారు. కాగా, కార్తీకి చెల్లెలికి సంధ్యారాణి స్నేహితురాలే కావడం గమనార్హం. ఈ క్రమంలో సంధ్యారాణి-కార్తీక్ ప్రేమ వ్యవహారం వారింట్లో తెలిసే ఉంటుందని తెలుస్తోంది.
రక్షణేదంటూ దత్తాత్రేయ ఆగ్రహం
మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. మహిళలపై దాడులు పెరుగాయన్నారు. నిందితుడు కార్తీక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంధ్యారాణి కుటుంబసభ్యులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని కోరారు.
అవారా కార్తీక్.. ప్రేమను నిరాకరించడంతోనే: డీసీపీ
తన ప్రేమ, తనతో పెళ్లిని నిరాకరించినందుకే సంధ్యారాణిని కార్తీక్ పెట్రోల్ పోసి హతమార్చాడని ఉత్తర మండలం డీసీపీ సుమతి తెలిపారు. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదనే కార్తీక్ ఈ ఘోరానికి తెగబడ్డాడని చెప్పారు. గురువారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో కార్తీకి ఈ ఘోరానికి పాల్పడితే.. రాత్రి 11గంటల సమయంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కార్తీక్ తన వెంటబడుతున్నాడని సంద్యారాణి తను పనిచేస్తున్న షాపు యజమాని జగన్కి చెప్పిందని, దీంతో ఆయన కార్తీక్ను మందలించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం సంధ్యారాణి వెంటపడిన కార్తీక్.. ఆమె మరోసారి నిరాకరించడంతో వెంటతెచ్చుకున్న పెట్రోలు పోసి నిప్పంటించాడని తెలిపారు. రెండేళ్ల పరిచయం ఉండటంతో కార్తీక్ సదరు షాపులో సంధ్యారాణికి ఉద్యోగం ఇప్పించాడని, ఆమె తన ప్రతిభతో ఉద్యోగాన్ని కాపాడుకుందని, అవారాగా మారిన కార్తీక్ ఆ తర్వాత ఉద్యోగం చేయడం మానేశాడని చెప్పారు. సంధ్యారాణి అందంగా, చక్కగా ఉంటుందని, ఆమె ఉన్నత చదువులు చదివిందని డీసీపీ తెలిపారు. ఏడో తరగతి ఫెయిలైన కార్తీక్ గత ఏడాది కాలంగా అవారా తిరుగుతున్నాడని చెప్పారు. అవారా తిరుగుతున్నవారిని ఎవరు ఇష్టపడతారని అన్నారు. సంధ్యారాణి కూడా అదే చేసిందన్నారు. కానీ, ఆమెపై కోపం పెంచుకున్న కార్తీక్ ఈ ఘోరానికి పాల్పడ్డాడని తెలిపారు. అంతకుముందే కార్తీక్ ఇచ్చిన సెల్ ఫోన్ కూడా అతనికి సంధ్యారాణి తిరిగిచ్చేసిందని తెలిపారు. హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, సీసీ కెమెరాల ఫుటేజీ తీసుకుంటున్నామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామని తెలిపారు.