సోనియాని ముంచింది వీళ్లే, చంద్రబాబు వల్లే కాంగ్రెస్లోకి: గుత్తా
నల్గొండ: కాంగ్రెస్ పార్టీని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ముంచింది ఇప్పుడు ఉన్న ముఖ్య నేతలేనని నల్గొండ పార్లమెంటు సభ్యులు, ఇటీవలే తెరాసలో చేరిన గత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తాను కాంట్రాక్టుల కోసం కాదని, ప్రాజెక్టుల నిర్మాణం కోసం పార్టీ మారానని చెప్పారు.
టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల వ్యాఖ్యలు గురివింద గింజ చందంగా ఉన్నాయి చెప్పారు. తాను ఎంపీగా బరిలో లేకపోతే కోమటిరెడ్డి వెంకట రెడ్డి 2009, 20174 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేవారా అని ప్రశ్నించారు.
అప్పట్లో, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాల వల్లే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ముఖ్యుల పంచాయతీతో ఆ పార్టీని వీడానని చెప్పారు. కడుపులో కత్తులు పెట్టుకొని ఉత్తమ్, కోమటిరెడ్డిలు కౌగిలించుకుంటున్నారన్నారు. కరచాలనం చేసినా వృథాయే అన్నారు. నన్ను తిట్టేందుకైనా కాంగ్రెస్ నేతలంతా ఒక్కటైనందుకు సంతోషంగా ఉందన్నారు.
కాగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలు పరస్పరం నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ సమావేశానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జానా రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు వచ్చారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఫిరాయింపుదారులను చూసి ఊసరవెల్లిలే సిగ్గుపడుతున్నాయని, కేసీఆర్ అధికారంలోకి రాగానే నాగార్జున సాగర్ ఎండిపోయిందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.