స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
పదోన్నతులు విషయంలో మాట్లాడేందుకే తాను ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ నివాసానికి వెళ్లినట్లు సస్పెండైన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి పోలీసులకు తెలిపారు.
హైదరాబాద్: పదోన్నతులు విషయంలో మాట్లాడేందుకే తాను ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ నివాసానికి వెళ్లినట్లు సస్పెండైన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి పోలీసులకు తెలిపారు. జనవరి 19న రాత్రి స్మితా సబర్వాల్ ఇంటికి ఆయనతోపాటు కొత్త బాబు ప్లజెంట్ వ్యాలీలోకి ప్రవేశించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
చంచల్గూడ గూడ జైలులో రిమాండ్లో ఉన్నవారిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు ఆనంద్ కుమార్ రెడ్డి. తనతోపాటు 9 మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయం మాట్లాడేందుకు తాను స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. రాత్రి వేళ ఎందుకు వెళ్లారని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు.
1996 గ్రూప్-2లో ఉమ్మడి రాష్ట్రం నుంచి దాదాపు 26 మంది అభ్యర్థుల పోస్టింగులు కోర్టు వివాదంతో రద్దయ్యాయని, 2018లో మళ్లీ కోర్టు జోక్యంతో డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగులు వచ్చాయని, వారిలో 16 మందిని ఏపీకి కేటాయించగా, 10 మందికి తెలంగాణ పోస్టింగులు వచ్చాయన్నారు. వీరిలో తాను ఒకడినని ఆనంద్ వివరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఏపీకి వెళ్లినవారికి పదోన్నతులు వచ్చాయని.. తామింకా డిప్యూటీ తహసీల్దార్లుగానే ఉన్నామని.. ఈ విషయం చెప్పేందుకే వెళదామనుకున్నానని ఆనంద్ కుమార్ తెలిపారు. మరోవైపు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో హోటల్లో టీ తాగడానికి వెళ్దామంటూ తీసుకొచ్చి తనను ఇలా ఇరికించారంటూ కొత్త బాబు వాపోయాడని పోలీసులు తెలిపారు. కాగా, జనవరి 19న రాత్రి 11 గంటల ప్రాంతంలో స్మితా సబర్వాల్ ఇంటికి తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.