జనసేనకు ప్రచారం చేస్తా, అప్పుడు బాబాయి పవన్ కళ్యాణ్ వద్దన్నారు: రామ్ చరణ్ తేజ
హైదరాబాద్: తన బాబాయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నటుడు రామ్ చరణ్ తేజ గురువారం వెల్లడించారు. తన తండ్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే తాను ప్రచారం చేద్దామని అనుకున్నానని చెప్పారు. కానీ అప్పుడు బాబాయ్ పవన్ వద్దన్నారని చెప్పారు.
ఇప్పుడు తన బాబాయి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయి అనుమతిస్తే నేను జనసేన తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
'పవన్ కళ్యాణ్ అంతమొనగాడైతే, చిరంజీవి పార్టీ మాటేమిటి, దాని వెనుక మర్మమేమిటో?'
కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా నుంచి తన జనసేన యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన గత ఆదివారం యాత్రను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు కుటుంబం కూడా అండగా ఉండేందుకు సిద్ధమయింది. గతంలోనే అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ, వరుణ్ తేజ, అల్లు అర్జున్ తదితరులు మద్దతుగా ఉంటామని ప్రకటించారు.