గజ్వేలు నుంచి పోటీ చేస్తా, కానీ: ఓటు హక్కుపై గద్దర్ ప్రచారం
హైదరాబాద్: ప్రజలు కోరుకుంటే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తే దేశంలో 25శాతం ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, అందరికీ ఆరోగ్యం, నిరుద్యోగులకు లక్ష కొలువులు వచ్చాయా? లేదా అనే అంశాలను తన చైతన్య యాత్రలో ప్రశ్నిస్తానన్నారు.
ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ను సచివాలయంలో కలిసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రకు అనుమతివ్వాలని కోరారు.
తెలంగాణలోని 31 జిల్లాల్లో మీట్ ద ప్రెస్ ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తానని తెలిపారు. ఓటు నమోదు చేసుకోవడమే తన జీవితంలో గొప్ప మార్పు అని చెప్పారు. పరస్పరం నిందించుకోవడం, తిట్టుకోవడం వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న అసలు సమస్యలు పక్కకు పోతాయన్నారు.
పోస్టర్ల చించివేతపై విమలక్క
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన బహుజన బతుకమ్మ పోస్టర్లు చించివేయడంపై విమలక్క ఫైర్ అయ్యారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణను సాధించిందని, ప్రతి సంవత్సరం బహుజన బతుకమ్మను జరుపుతామని తెలిపారు.
దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా కష్టపడి పోస్టర్లను ప్రింట్ చేయించామని అయితే వాటిని చించివేయడం బాధాకరమని ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాము ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని, ఎన్నికలకు తమ సంస్థ దూరమని, పోస్టర్లు చించివేయడం అన్యాయమని, వెంటనే పోస్టర్ల చించివేతను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.