నాన్నను చంపేస్తా: ప్రణయ్ మృతదేహం చూసి భోరుమన్న అమృత, ‘మారుతీరావు కబ్జాకోరు’
నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన తన భర్త విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత తట్టుకోలేకపోయింది. తన భర్త మరణానికి కారణమైన తన తండ్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కన్నీరుమున్నీరుగా విలపించిన అమృత
అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదించింది. జీవితాంతం ఎంతో ఆనందంగా బతకాలని ఎన్నో కలలు, పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో తన భర్తను దూరం చేయడంపై అమృత తీవ్ర వేదనతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
ప్రణయ్ని నయీమ్ బ్యాచ్తో మా నాన్నే చంపించారు, మొదట్నుంచీ.. : అమృత కన్నీటిపర్యంతం
నాకు నా బిడ్డకు రక్షణ కల్పించాలి
తాను పుట్టింటికి వెళ్లే ప్రసక్తే లేదని అమృత తెలిపింది. తనకు, తనకు పుట్టబోయే బిడ్డకు పోలీసుల రక్షణ కావాలని వేడుకుంది. ప్రణయ్ హత్యపై అమృత మాట్లాడుతూ... మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
నాన్నను చంపేస్తా..
‘నేను నా తండ్రికి సొంత కూతురునే... అయినా నా పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తాడని అనుకోలేదు' అని అమృత తెలిపింది. ‘ఇప్పుడు మా నాన్న నా ఎదురుగా వచ్చి క్షమించమ్మ అంటే మా నాన్నను చంపేస్తా' అని హెచ్చరించింది. తాను పరువు హత్యలు, కులరహిత సమాజం కోసం పోరాటం చేస్తానన్న అమృత... మా నాన్న, బాబాయ్ సైకోలు అంటూ మండిపడింది. నేను ఎన్ని కష్టలు ఎదురైనా నా బిడ్డను పెంచుకుంటానన్న అమృత... పుట్టింటికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
హత్యలో వారి హస్తముంది..
మరోవైపు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నేత కరీంతో పాటు మరికొందరితో కలిసి నాన్నే... ప్రణయ్ని చంపించాడని ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ వెల్లడించారు అమృత. కాగా, ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి, బాబాయ్ని అరెస్ట్ చేసిన పోలీసులు... మిర్యాలగూడ కాంగ్రెస్ నేత కరీంను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హీరోలాంటి కొడుకును చంపేశారు.. మారుతీరావు కబ్జాకోరు
మరో వైపు ప్రణయ్ తల్లి కూడా అతని మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. హీరోలాంటి తన కొడుకును పొట్టనపెట్టుకున్నారంటూ మారుతీరావుపై దుమ్మెత్తిపోసింది. ఈ పాపం ఊరికేపోదని, అతనికి కూడా ఇలాంటి గతే పడుతుందని కన్నీటిపర్యంతమైంది. మాల, మాదిగలు, తక్కువ కులాలకు చెందిన ప్రజలను బెదిరింపులకు గురిచేసి వారి భూములను మారుతీరావు కబ్జా చేశారని, అతనికి రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉందని ఆరోపించారు.
ఉక్రెయిన్ నుంచి సోదరుడు రాగానే..
కాగా, ప్రణయ్ సోదరుడు ఉక్రెయిన్ నుంచి మధ్యాహ్నం వరకు మిర్యాలగూడ చేరుకోనున్నారు. అనంతరం ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ప్రణయ్ అంత్యక్రియల కోసం భారీ ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. దీంతో మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.