రానున్న ఎన్నికల్లో పోటి చేయను.... కండిషన్స్ అప్లై.... ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణ పీసీసీ పదవికి పోటిపడుతున్నానంటూ తన మనసులోని మాటను బయట పెట్టిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ పదవిని అప్పగిస్తే ఎలాంటీ రాజ్యంగపరమైన పదవులు లేకుండా పని చేస్తానని హమీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో పోటి చేయనని స్పష్టం చేశారు. కాగా ఇదివరకే పీసీసీ అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, పునర్వైభవం తెస్తానని చెప్పారు. అందుకోసం తన వద్ద ప్రత్యేక ఆయుధం ఉందని చెప్పారు. దాన్ని సమయం వచ్చినప్పుడు బయటకు తీసుకువస్తానని అన్నారు.
పీసీసీ రేసులో జగ్గారెడ్డి
తెలంగాణలో పార్టీ అధ్యక్షున్ని మారుస్తారనే ఉహాగానాలు జోరుగా ఊపందుకోవడంతో .. పీసీసీ పగ్గాలను చేపట్టేందుకు ఆ పార్టీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం అధ్యక్ష పదవి కోసం పోటిపడుతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు. తాను సైతం పోటీలో ఉన్నట్టు రెండు రోజుల క్రితమే ఆయన ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవిని తనకు కేటాయించాలని హైకమాండ్కు విజ్ఝప్తి చేశారు. ఢిల్లీ నేతలకు ధరఖాస్తు కూడ పెట్టుకున్నట్టు చెప్పారు. ఢిల్లీలో జరగనున్న పార్టీ సమావేశానికి తన బయోడేటాను కూడ పంపినట్టు జగ్గారెడ్డి తెలిపారు.
ఉప ఎన్నికతో పార్టీ అధినేత మార్పు
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం కావడంతో కాంగ్రేస్ పార్టీకి, కొత్త నాయకత్వంతో జవసత్వాలు నింపాలని హైకమాండ్ భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోనేందుకు గట్టి నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్థుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చే యోచనలో పార్టీ హైకమాండ్ సంకేతాలను పంపింది. దీంతో ఆశవహులు ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
టీపీసీసీపై కన్నెసిన పార్టీ సీనియర్లు
అయితే కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరమే పార్టీ నేతకు శ్రీకారం చుట్టే అవకాశం ఉండడడంతో... ఇప్పటి నుండే ఆ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ పార్టీ అధ్యక్షున్ని మార్చితే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన హైకమాండ్ను కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కూడ తన ఆకాంక్షను తెలిపినట్టు చెప్పారు.
రేవంత్ అధ్యక్షుడంటూ ప్రచారం..ఖండించిన హైకమాండ్
పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఇదివరకే కొనసాగింది. ప్రచారాన్ని నిజం చేస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణంగా ఉంటాయి. దీంతో హుజుర్నగర్ ఉప ఎన్నికల్లోనే రేవంత్ రెడ్డిని ఒంటరిని చేసిన సీనియర్లు అంతా ఏకం అయ్యారు. వారిలో జగ్గారెడ్డి కూడ ఉత్తమ్ వర్గానికి మద్దతు పలికారు. దీంతోపాటు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న హన్మంతరావు సైతం సీనియర్లను వదిలీ జూనియర్లకు ఎలా పదవిని కట్టబెడతారని ప్రశ్నించారు.
టీఆర్ఎస్కు దీటైన నాయకుని కోసం పార్టీ కసరత్తు
మొత్తం మీద గత అయిదు సంవత్సరాలుగా అధికార టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోనేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ పార్టీ చతికిల పడుతోంది. దీంతో పార్టీలో గెలిచిన 18 ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీ ఫిరాయించారు. అందరు అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా క్రిందికి వెళ్లడంతో... అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే రానున్న అయిదు సంవత్సరాల పాటు పార్టీని నడిపించే దీటైన నాయకుని ఎన్నిక కోసం పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించే నేతలకు ఎక్కువగా అవకాశాలు ఉండడంతో జగ్గారెడ్డి సైతం పార్టీ అధ్యక్ష పదవికి పోటిపడుతున్నట్టు తెలుస్తోంది.