నా వాహనంలో మీ రాష్ట్రానికి పంపిస్తా: గర్భిణీ స్త్రీ కుటుంబానికి హరీశ్ రావు హామీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేరు వింటే చాలు ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించే వ్యక్తి అని గుర్తుకు వస్తుంది. ఎందుకంటే, ఎవరైనా ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు పరుగెత్తుకుంటూ వెళ్లి సాయం చేస్తారాయన. అందుకే సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఎప్పుడూ తిరుగులేని మెజార్టీతో గెలుస్తూనే ఉన్నారు.
వెంటనే స్పందించిన మంత్రి..
తాజాగా, మరోసారి హరీశ్ రావు చేసిన మంచి పని ప్రశంసలందుకుంటోంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి రామాయంపేట మీదుగా దాదాపు 10 మంది కలిసి గత నాలుగు రోజులుగా కాలినడకన మధ్యప్రదేశ్కు బయలుదేరారు. వీరిలో ఒకరు సుస్మిత అనే గర్భిణీ మహిళ కూడా ఉన్నారు. ఈ క్రమంలో సదరు గర్భిణీ మహిళకు వైద్య సాయం అవసరమని తెలిసిన మంత్రి హరీశ్ రావు వెంటనే స్పందించారు. ఆమెను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
గర్భిణీ మహిళకు హరీశ్ హామీ..
గురువారం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సుస్మితను మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా తమ అత్తగారింటికి వెళ్లాల్సి ఉందని, ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవడంపై సుస్మిత మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి.. లాక్ డౌన్ వేళ ఇంత ఎండలో పయనించడం మంచిది కాదని సూచించారు. మీకు అన్నం పెట్టిస్తా, కావాల్సిన పని ఇప్పిస్తానని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.
Recommended Video
తన వాహనంలో మధ్యప్రదేశ్ పంపిస్తానని..
అంతేగాక, మే 7వ తేదీన లాక్ డౌన్ పూర్తయిన తర్వాత తన వాహనం ఇచ్చి గర్భిణీ స్త్రీ కుటుంబాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆమె స్వస్థలంలో దింపివస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. మధ్యప్రదేశ్ సీఎంఓ నుంచి మిమ్మల్ని బాగా చూసుకోవాలని తనకు ఫోన్ వచ్చిందని, బాగా చూసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అయితే, లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ ఎక్కడికీ వెళ్లవద్దని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు ఫోన్ చేయాలంటూ ఫోన్ నెంబర్ 9866199999 కూడా మంత్రి ఇవ్వడం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.