శ్రీనివాస్ కుటుంబ బాధ్యత నాదే: ఎమ్మెల్యే రసమయి
కరీంనగర్: సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మాంకాళి శ్రీనివాస్ అల్గునూర్లో మానకొండూర్ నియోజకవర్గ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రసమయి స్పందిస్తూ మృతుడు శ్రీనివాస్ కుటుంబ బాధ్యత అంతా నాదే అని సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
శ్రీనివాస్ మరణం చాలా దురదృష్టకరమని, 21 రోజులు దగ్గరుండి ప్రత్యేక వైద్య నిపుణులచే మెరుగైన వైద్యం అందించినప్పటికీ మృతి చెందడం బాధాకరమన్నారు. అతడు మృత్యువుతో పోరాడుతుంటే కొన్ని పార్టీల నాయకులు కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చాల్సింది పోయి ఆందోళనలు చేపట్టారన్నారు.
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్కు ఆంబులెన్స్లో తరలిస్తున్న సమయంలో అడ్డుపడిన నేతలు, శ్రీనివాస్ ఎలా ఉన్నాడో తెలుసుకోకుండా శవ రాజకీయాలు చేశారని ఆరోపించారు. బ్రతికించే ప్రయత్నం చేశారని, కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తారని మృతుడి భార్య చెప్పినా వినకుండా కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి స్వప్నాన్ని నిజం చేయడం కోసం 31 జిల్లాలలో పోల్చి చూస్తే అత్యధికంగా ఇక్కడే భూపంపిణీ చేశానన్నారు. రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమే కానీ మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రూ.20 లక్షల విలువ చేసే మూడెకరాల భూమి, రూ.5 లక్షల విలువ గల రెండు పడక గదుల ఇల్లు, రూ.10 లక్షల నష్ట పరిహారం, మృతుడి భార్యకు ఉపాధి, పిల్లల చదువులు, ఖర్చుల పూర్తి భాధ్యత అంతా నాదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
దళిత జాతి అభివృద్ధి కొరకు నిత్యం వేకువ జామునే లేచి అన్నీ గ్రామాలు తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్నాని తెలిపారు. సమస్యలు వచ్చినపుడు ఆవేశాలకులోనై, చెప్పుడు మాటలు విని ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ¿వద్దని ప్రజలకు సందేశామిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బూడిద ప్రేమలత, తెరాస మండలాధ్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి, ఉపాధ్యక్షుడు మాతంగి లక్ష్మణ్, యువజన విభాగం ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్, గ్రామశాఖ అధ్యక్షుడు వేల్పుల మల్లయ్య, నాయకులు ఎడ్ల భూంరెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, మాతంగి కనుకయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.