ఇంట్లో కూర్చొని గెలుస్తా, కెసిఆర్ పట్టించుకోరు, 3 కోట్లిస్తే చంద్రబాబు అమ్ముతారా: తలసాని
హైదరాబాద్: నేను ఇంట్లో కూర్చున్నా గెలుస్తానని మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో తానే గెలుస్తానని చెప్పారు. గెలుపు ఓటములను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టించుకోరని తలసాని చెప్పారు.
చంద్రబాబు ఇంటి విలువ రూ.23 లక్షలేనా
చంద్రబాబు ఇంటి విలువ కేవలం రూ.23 లక్షలేనా అని తలసాని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటన అంతా వట్టిదే అన్నారు. రూ.3 కోట్లు ఇస్తానని, చంద్రబాబు తన ఇంటిని అమ్మేస్తారా అని ప్రశ్నించారు. వచ్చే మూడేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు.
వరంగల్ ఉప ఎన్నిక వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్
వరంగల్ లోకసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో వరంగల్ లోకసభకు ఉప ఎన్నికలు వస్తున్నాయి.
వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తొలుత ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు వినిపించింది. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. దీంతో, గాలి వినోద్ కుమార్ పేరును తెరపైకి తీసుకు వచ్చారని తెలుస్తోంది. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను వామపక్షాలు ఖరారు చేశాయి.
రేపు ఛలో అసెంబ్లీ యథాతథం
వరంగల్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో రేపటి ఛలో అసెంబ్లీ యథాతథంగా ఉంటుందని వరవర రావు చెప్పారు. ఈ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో 400 ప్రజా సంఘాలు పాల్గొంటాయని చెప్పారు. ఎవరికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని వరవర రావు చెప్పారు.
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: సున్నం రాజయ్య
తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. తెలంగాణ శాసనసభలో రైతు సమస్యలపై నిర్వహించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పంటలు ఎండిపోయి, అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కొందరు హేళనగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసేలోగా రైతులకు భరోసా కల్పించాలన్నారు. అనంతం అసెంబ్లీ రేపటికి (బుధవారానికి) వాయిదా పడింది.