దారుసలాం కాదు.. లాల్ దర్వాజ! మిషన్ 70..: స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: దేశం బాగు పడాలంటే కేవలం తన ప్రవచనాలు మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక శక్తితో పాటు రాజకీయ శక్తి అవసరమని గమనించానని ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి.
తెలంగాణ ఎన్నికలు, దక్షిణాదిపై ప్లాన్: బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద
చలించిపోయా.. ఆ ముగ్గురి వల్లే..
ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా.. దళిత వాడలు, నిరాదరణకు గురైన బస్తీల్లో తిరిగానని, అక్కడి పరిస్థితులు చూసి తీవ్రంగా చలించానన్నారు. తాను రాజకీయాల్లో ఇమడగలనా లేదా? అని ఆలోచించానని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలంటే ఫాదర్ అయినా ఉండాలి.. గాడ్ ఫాదర్ అయినా ఉండాలి. కానీ నాకు దేవుడు తప్ప దిక్కెవరు లేరని చెప్పుకొచ్చారు స్వామీజీ పరిపూర్ణానంద. ఈ విషయంలో తన తల్లిదండ్రులు, గురువుల రాజకీయాల్లోకి రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు రాకపోతే.. ఇంకెప్పుడు అడుగు పెట్టొద్దని, ఏది ఆశించవద్దని ఆ ముగ్గరు చెప్పారని స్పష్టం చేశారు.
అమిత్ షా చూపిన గౌరవంతో..
‘అక్టోబర్ 8న అమిత్షాను కలిసినప్పుడు.. నా మీద చూపిన గౌరవం, వారితో మాట్లాడాకా నా ధైర్యం మరింత రెట్టింపు అయ్యింది. మీ సేవ ఈ దేశానికి అవసరమని అమిత్ షా తెలిపారు. నవరాత్రులు అయ్యాక నిర్ణయం చెబుతానన్నాను. స్వామిజీ తెలంగాణకు వెళ్లండి.. లక్ష్మణ్ను కలిసాక పార్టీ మీకు సూచన చేస్తుందని అన్నారు. రాజకీయం కాదు రాజనీతి ఉండాలని అనుకుంటున్నాను. దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని పరి రక్షించుకోవాలి అంటే బీజేపీ రావాలనుకున్నాను' అని స్వామి పరిపూర్ణానంద తెలిపారు.
బీజేపీలో కులాలు.. కుటుంబాలు లేవు..
‘బీజేపీలో కులాలు, కుటుంబాలు లేవు అవినీతి లేదు. గుణమే హద్దు. తెలంగాణలో జనతా సర్కార్ రావాలి.. పరివార సర్కార్ పోవాలి.. అదే మా నినాదం. మిషన్70లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తోంది. అమిత్ షా బాధ్యత తీసుకోమన్నారు. ఏ పదవి, బాధ్యత వద్దని తెలిపాను. పని చేయడానికి వచ్చాను. పదవి కోసం కాదు' అని పరిపూర్ణానంద అన్నారు.
దారుసలాం కాదు.. లాల్ దర్వాజ.. మిషన్ 70..
‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఏ గీత గీసిన పాటిస్తాను. ఆశ లేదు ఆశయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు.. దారుసలాంతో నడిచాయి. ఇప్పుడు వచ్చే బీజేపీ సర్కార్ లాల్ దర్వాజ ఆజ్ఞలతో నడుస్తది. అమావాస్య నాకు మంచి ముహూర్తం. ఎన్నికల కమిషన్ కూడా మాకు మంచి రోజునే కేటాయించింది. తెలంగాణ.. కాషాయ తెలంగాణగా మారబోతోంది' అని స్వామి తెలిపారు.‘సామాన్య కార్యకర్తలా మిషన్ 70కి తీసుకొచ్చి.. తర్వాత వేరే ఊరికి వెళ్తానని చెప్పాను' అని స్వామి చెప్పారు.
స్వామి రాకతో మరింత బలం..
బీజేపీలోకి స్వామీ పరిపూర్ణానంద చేరడం తమ పార్టీకి మరింత బలాన్ని తెచ్చిపెట్టిందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తెలిపారు. రంగులు మార్చే రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ దూరమని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ సందేశాన్ని స్వామీజీ ప్రజల్లోకి తీసుకొని వెళతారన్నారు.
కాంగ్రెస్ మునిగిన నావ.. టీఆర్ఎస్ మునిగిపోతున్న...
టీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ అని.. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్వామీజీ అవసరం తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన చెప్పారు. ఈసారి ఎన్నికల్లో స్వామీజీ తమకు విజయాన్ని అందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు బీజేపీతోనే సాధ్యం అని.. స్వామీజీ దేశం కోసం-ధర్మం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు.