గుత్తా మాదిరిగా పూటకో పార్టీ మారను, పీసీసీ ఇవ్వకున్నా కాంగ్రెస్లోనే ఉంటా: కోమటిరెడ్డి
భువనగిరి: పీసీసీ పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పార్టీ మారేది లేదని సీఎల్పీ ఉప నాయకుడు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. పూటకో పార్టీ మారడానికి తాను గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు
పీసీసీ అధ్యక్ష పదివి ఇచ్చినా..ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. నల్గగొండ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
ఉన్న ఏడాది కాలమైనా మంచి పాలన అందించాలని ప్రభుత్వానికి సూచించారు.2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందనే ధీమాను వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇలాంటి పాలన ఉండటం దురదృష్టకరమన్నారు.
కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు.
ఇక పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.