ప్రధాని మోడీకి లేఖ రాస్తా: బీసీలు ఏకమవ్వాలని సుమన్ పిలుపు
హైదరాబాద్: దేశ చరిత్రలో మహాత్మ జ్యోతిరావు పూలేకు సముచిత స్థానం కల్పించాలని, ఆయన జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ కోరారు. పాఠ్యాంశాలలో ఫూలే జీవిత చరిత్రను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, ఓయూజేఏసీ, తెలంగాణ విద్యార్థి సేఫ్టీ ఫెడరేషన్, బీసీ జేఏసీ, విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫూలే 189వ జయంతి ఉత్సవాల సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ జేఏసీ ఛైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన నటుడు సుమన్ మాట్లాడారు.
హక్కుల సాధనకు బీసీలందరూ ఏకమై పోరాడాలని సుమన్ అన్నారు. ఆదివారం విశాఖపట్టణంలో సరైనోడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పటికీ పూలే జయంతి సభకు హాజరయ్యానని సుమన్ తెలిపారు. బీసీల సభలు ఎక్కడ జరిగినా ప్రతి బీసీ హాజరుకావాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు, టీడీపీ నేత రాపోలు ఆనందభాస్కర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, యువజన నాయకుడు అనిల్కుమార్యాదవ్, బీసీ జేఏసీ చైర్మన్ బొమ్మ హన్మంతరావు, కన్వీనర్ పుప్పాల మల్లేష్, తెలంగాణ విద్యార్థి సెఫ్టీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్గౌడ్, చెన్న శ్రీకాంత్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రీ, టీఆర్ఎస్వీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ద్వాత్రిక స్వప్న తదితరులు హాజరయ్యారు.