మంత్రి పదవి నుండి తొలగిస్తానన్నారు.. వర్గీకరణకే కట్టుబడి ఉన్నా: కడియం సంచలనం
హైదరాబాద్: ఏ పార్టీలో ఉన్నా.. ఎస్పీ వర్గీకరణకు తాను కట్టుబడి ఉన్నానని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. టిడిపిలో ఉన్న సమయంలో మంత్రి పదవిని తొలగిస్తానని చెప్పినా కానీ, తాను వెనక్కు తగ్గలేదని కడియం గుర్తు చేశారు.
Recommended Video
హైద్రాబాద్ సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఎస్పీ వర్గీకరణ విషయమై ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న టిఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకొని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శలు గుప్పించడాన్ని కడియం తప్పుబట్టారు.
మంత్రి పదవి తీసేస్తానన్న వర్గీకరణకు కట్టుబడి ఉన్నా
తాను ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. టిడిపి ప్రభుత్వంలో మంత్రి పదవి తీసేస్తానని చెప్పినా కానీ, తాను మాత్రం వర్గీకరణకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. టిఆర్ఎస్ కూడ వర్గీకరణకు కట్టుబడే ఉందని ఆయన గుర్తు చేశారు.
మందకృష్ణ ఆందోళనలో రాజకీయ ప్రయోజనం
ఎస్సీ వర్గీకరణకుకట్టుబడి ఉన్నామని టిఆర్ఎస్ ప్రకటించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గుర్తు చేశారు. అదే సమయంలో మందకృష్ణ చేస్తున్న ఆందోళనలో రాజకీయ కుట్ర కన్పిస్తోందని చెప్పారు. టిడిపి, బిజెపిలపై ఒత్తిడి తేకుండా టిఆర్ఎస్పై ఒత్తిడి తేవడంలో ఆంతర్యమేమిటని కడియం శ్రీహరి ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగానే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కెసిఆర్ పై మందకృష్ణ అక్కసు కన్పిస్తోంది .కెసిఆర్ ను తిడుతూ బిజెపి నేతలతో తిరుగుతున్నారని కడియం విమర్శించారు.
జనవరి 5 వరకు వేచి చూద్దాం
జనవరి 5వ, తేది వరకు పార్లమెంట్ సమావేశాలు సాగుతున్నాయని అప్పటివరకు వేచి చూద్దామని ఆయన మందకృష్ణకు సూచించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. కానీ, పిఎంఓ నుండి ఇంతవరకు సమాచారం రాలేదన్నారు. జనవరి 5వరకు కూడ ఎలాంటి సమాచారం రాకపోతే ఏం చేయాలో ఆలోచిస్తామని కడియం శ్రీహరి చెప్పారు.బిజెపికి వర్గీకరణపై చిత్తశుద్ది లేకపోవచ్చునని చెప్పారు.
వర్గీకరణపై టిడిపి మొసలి కన్నీరు
వర్గీకరణపై టిడిపి మొసలి కన్నీరు కారుస్తోందని కడియం ఆరోపించారు. ఏపీ రాష్ట్రంలో మందకృష్ణను తిరగకుండా అడ్డుకొన్న టిడిపిపై మందకృష్ణ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.తెలంగాణ టిడిపి నేతలు వర్గీకరణపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కడియం విమర్శించారు.మంత్రివర్గంలో ఎవరుండాలో ఎవరుండకూడదో మందకృష్ణ నిర్ణయించకూడదని కడియం హితవు పలికారు.