బిజెపిలోనే ఉంటా, నాగర్కర్నూల్ నుండి పోటీ చేస్తా: నాగం
కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగం జనార్థన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో టిడిపి నుండి నాగం జనార్థన్రెడ్డి బయటకు వచ్చారు. టిడిపి నుండి నాగం జనార్థన్రెడ్డి వచ్చిన తర్వాత స్వంతంగా పార్టీని పెట్టుకొన్నారు. అయితే ఆ పార్టీతో పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
దీంతో 2014 ఎన్నికలకు ముందే నాగం జనార్థన్రెడ్డి బిజెపిలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
నాగం జనార్థన్రెడ్డికి బిజెపిలోని రాష్ట్ర నాయకత్వానికి మద్య కొంత గ్యాప్ ఉందనే ప్రచారం కూడ ఉంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో చర్చించిన తర్వాత నాగం జనార్థన్రెడ్డి బిజెపిలో యాక్టివ్గా మారారు.
అవన్నీ తప్పుడు ప్రచారాలే
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్థన్రెడ్డి చెప్పారు.ఉద్దేశ్యపూర్వకంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగం జనార్థన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ మారాలనుకుంటే నన్ను ఆపేవారే లేరని నాగం జనార్థన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ మారాలనే ఉద్దేశ్యంతో తనకు లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుండే పోటీ చేస్తా
2019 ఎన్నికల్లో నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని నాగం జనార్థన్రెడ్డి ప్రకటించారు. నేను నిబద్ధత కలిగిన వ్యక్తిని. నాగర్కర్నూల్ నుంచే నేను పోటీ చేస్తా. విపక్షాల్లో సరైన నాయకుడు ఉంటే టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయ్యే అవకాశం ఉందని నాగం జనార్థన్రెడ్డి అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో మినహ నాగం జనార్ధన్రెడ్డి నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండే పోటీ చేశారు.గత ఎన్నికల్లో మాత్రం తనయుడిని ఈ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దింపారు. అయితే కొడుకుతో పాటు నాగం జనార్థన్రెడ్డి కూడ ఓటమి పాలయ్యారు.
బిజెపి పుంజుకొంటుంది
హిమాచల్ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల తర్వాత బీజేపీ పుంచుకునే అవకాశం ఉందని నాగం జనార్దన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడ బిజెపి అధికారంలోకి వస్తోందని నాగం అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై చూపుతాయన్నారు. తెలంగాణలో బలపడేందుకు తమ జాతీయ నాయకత్వం కేంద్రీకరించిందని చెప్పారు.
పార్టీ మారుతారనే ప్రచారమెందుకు
నాగం జనార్థన్రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. కొంతకాలం క్రితం ఆయన తిరిగి టిడిపిలోకి వెళ్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ప్రకటించారు. తాజాగా రేవంత్రెడ్డి ఎపిసోడ్ ఘటన తర్వాత నాగం జనార్థన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే బిజెపి నేతల మధ్య సమన్వయలోపం కారణంగా ఈ రకమైన ప్రచారం సాగుతోందని నాగం సన్నిహితులు చెబుతున్నారు.