కోదండరామ్ ఫ్రెండ్, సీఎం కావాలనే ఆశ లేదు, ఒకప్పుడు ఉండేది, కానీ...: జైపాల్రెడ్డి ఆసక్తికరం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనే ఆశ తనకు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనే ఉన్న ఆశ ప్రస్తుతం తనకు లేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తనకు లేదన్నారు.
మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్రెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై జైపాల్ రెడ్డి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తన వెనుక ఎవరూ కూడ లేరని ఆయన చెప్పారు. వర్గ రాజకీయాలను తాను ఏనాడూ కూడ ప్రోత్సహించలేదని ఆయన చెప్పారు.
సీఎం కావాలనే ఆశ చచ్చిపోయింది
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలనే ఆశ తనకు లేదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2014కు ముందు చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనే ఆశ అప్పుడు ఉందన్నారు. కానీ, ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో సీఎం కావాలనే ఆశ తనకు చచ్చిపోయిందని చెప్పారు.రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనే ఆశలు కూడ తనకు లేవన్నారు.
ఓటమిని తప్పించుకొనేందుకు కెసిఆర్ హమీలు
2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఘోరంగా పరాజయం పాలుకానుందని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు టిఆర్ఎస్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల నుండి వస్తున్న స్పందనతో తనకు ఈ విషయం అర్ధమైందన్నారు.టిఆర్ఎస్ పాలనపై సగటు ఓటరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు.రైతులు కెసిఆర్పై ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. రుణమాఫీ వల్ల రైతాంగానికి ప్రయోజనం జరగలేదన్నారు దీన్ని నుండి రైతుల అసంతృప్తిని మళ్ళించేందుకు పంటకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి స్కీమ్ను కెసిఆర్ ముందుకు తెచ్చారని జైపాల్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలు కానున్నామనే భయంతో కొత్త కొత్త పథకాలకు టిఆర్ఎస్ శ్రీకారం చుట్టిందన్నారు.
కెసిఆర్ ఫ్రంట్ కాదు స్టంట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కేవలం స్టంట్ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్లో మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆయనకు అనుకూలగా కెసిఆర్ మాట్లాడుతున్నారని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఆయన చెప్పారు.కాంగ్రెస్ ను ఓడించేందుకు బిజెపిలో చేరాల్సిందేనని ఆయన చెప్పారు.కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ ఫ్రంట్ పేరుతో స్టంట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
కోదండరామ్ మంచి ఫ్రెండ్
టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ తనకు మంచి స్నేహితుడేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చెప్పారు. అయితే తెలంగాణ జన సమితి పేరుతో కోదండరామ్ పార్టీ ఏర్పాటు విషయమై ఆయనకు ఎలాంటి లెక్కలు ఉన్నాయనే విషయం తనకు తెలియదన్నారు. రెండు నెలలుగా కోదండరామ్ తో కనీసం ఫోన్లో కూడ మాట్లాడలేదని జైపాల్ రెడ్డి చెప్పారు.కోదండరామ్ పార్టీ ఏర్పాటు విషయమై వ్యాఖ్యలు చేయడం తొందరపాటు అవుతోందన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తనకు అవగాహన లేదన్నారు.
ఉత్తమ్ ఎంపికలో నాకు సంబంధం లేదు
పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఎంపికలో తన పాత్ర లేదని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. రెండోసారి ఆయనను కొనసాగించే విషయంలో కూడ అధిష్టానం తనను సంప్రదించలేదని ఆయన చెప్పారు. పార్టీలో ముఠాలను కట్టడంపై తనకు నమ్మకం లేదన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయమై స్థానిక పరిస్థితుల కారణంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.