పవన్ కోరితే సహయం చేసేందుకు రెడీ, మోడీపై భ్రమలు తొలిగాయి: జయప్రకాష్ సంచలనం
హైదరాబాద్: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో ముందు ఆయనను చెప్పనివ్వండి., తన వైఖరిని ప్రకటించిన తర్వాత తన సహయం కోరితే చేసేందుకు సిద్దంగా ఉన్నానని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణతో ఓ తెలుగు టీవి ఛానల్ ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై జయ ప్రకాష్ నారాయణ స్పందించారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, కులాలు, ప్రాంతాలు, బాషలను చూపి ఓట్లను అడగడం వంటి అంశాలపై తాను వ్యతిరేకమన్నారు. ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ కోరితే సహయనికి రెడీ
ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యం ఉన్న వారెవరైనా రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకొంటానని జయప్రకాష్ నారాయణ చెప్పారు. ప్రజల్లో ఆదరణ ఉన్న సినీ నటుడు రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ వైఖరిని ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కోరితే తాను సహయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు జయ ప్రకాష్ నారాయణ తేల్చి చెప్పారు.
కులాన్ని అంటగట్టడం దుర్మార్గం
తాను ఏనాడూ పదవులు కావాలని కోరుకోలేదని జయప్రకాష్ నారాయణ చెప్పారు. తనను విజయవాడలో పోటీ చేయాలని కోరారు. ఆ సమయంలో తనకు మద్దతిస్తామని కూడ సంప్రదింపులు జరిపారని ఆయన గుర్తు చేశారు. అయితే విజయవాడలో ఎంపీగా పోటీచేస్తే విజయం సాధించేవాడిని కేంద్రంలో మంత్రయ్యేవాడినని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, తనకు ఆ కోరికలేదన్నారు. అయితే మల్కాజిగిరిలో పోటీ చేసినట్టు చెప్పారు.తనకు కులాన్ని అంటగట్టడం దుర్మార్గమన్నారు. తనకు కులపిచ్చి ఉంటే విజయవాడలో పోటీచేసేవాడినని చెప్పారు.
2014లో టిడిపి, బిజెపిలు 2014లో పొత్తు కోసం సంప్రదించారు
2014 ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి కూటమి తమతో పొత్తు పెట్టుకోవాలని సంప్రదింపులు జరిపారని ఆయన చెప్పారు. అయితే కారణాలు ఏమయ్యాయో కానీ, పొత్తు విషయమై టిడిపి బిజెపి నేతలు వెనక్కు వెళ్ళారని చెప్పారు. అయితే ఎందుకు వెనక్కు వెళ్ళారనే విషయాలను మాత్రం జెపి ఆ ఇంటర్వ్యూలో చెప్పలేదు. కానీ తాను ఎవరినీ ఎప్పుడు బ్లేమ్ చేయబోనని స్పష్టం చేశారు.
మోడీపై భ్రమలు తొలిగిపోయాయి
మోడీపై తనకు భ్రమలు తొలిగిపోయాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులోనే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు విషయాల్లో మినహ యూపీఏ అవలంభించిన విధానాలనే ఎన్ డి ఏ కూడ అనుసరిస్తోందన్నారు.
ఎన్నికల వ్యవస్థలో మారాలి
ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు.డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో విజయం సాధించే రాజకీయాలకు తాను దూరమన్నారు.ఈ తరహ రాజకీయాలు తనకు సరిపోవన్నారు. 10 శాతం ఓట్లున్న వారితో పోత్తులు పెట్టుకొనేందుకు రాజకీయపార్టీలు ముందుకువస్తాయన్నారు. అయితే ఏపీ రాష్ట్రంలో తమ అంచనా ఫెయిలైందన్నారు. అయితే ఢిల్లీలో మాత్రం ఆ తరహ ప్రయోగం సక్సెస్ అయిందన్నారు. ఢిల్లీలో తలసరి ఎక్కువ, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఈ కారణంగానే ఆప్ విజయం సాధించిందని జయ ప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు.
రుణమాఫీతో రైతులకు నష్టమే
రుణమాఫీతో రైతులకు నష్టమేనని జయ ప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు.రుణమాఫీ కారణంగా పార్టీలకు ఓట్లు తెచ్చే పెడుతోంది. కానీ, రైతులు తాము పండించి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం ఇతరత్రా అంశాలను ఆయన ప్రస్తావించారు. పార్టీలకు తప్ప రైతులకు ఈ స్కీమ్ వల్ల ఉపయోగం లేదన్నారు జయ ప్రకాష్ నారాయణ.