ఆలోపు అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలి.. లేదంటే ప్రాణత్యాగం చేస్తా : వీహెచ్ సంచలన స్టేట్మెంట్
గతేడాది ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పంజాగుట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. విగ్రహాన్ని ధ్వంసం చేసి డంప్ యార్డులో పడేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై దళిత సంఘాలు,ప్రజా సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా పంజాగుట్ట సెంటర్లో పలుమార్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన వీహెచ్.. మరోసారి ఆ ఘటనపై స్పందించారు.
రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కూల్చేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని వీహెచ్ మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూలగొట్టి చెత్తకుప్పలో పారవేయడం ఎంతవరకు సబబు అని.. దాన్ని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.
రాజ్యాంగం రాసిన మహానీయునికి ఇంత అవమానం జరుగుతుంటే.. ఏ నాయకుడు మాట్లాడకపోవడం దురదృష్టకరం అన్నారు. కూల్చిన చోటే మళ్లీ అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాడ్ చేశారు. రిపబ్లిక్ డే నాడు అంబేడ్కర్ విగ్రహం పోలీస్ స్టేషన్లో ఉండటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ లోపు ప్రభుత్వం పంజాగుట్ట సెంటర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ప్రాణాలు అర్పిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వీహెచ్ మాట్లాడారు. అసెంబ్లీ, లోక్ సభ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, అన్ని ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. అధిష్టానం ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి సరైన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని అన్నారు. ఎప్పుడూ అగ్ర కులాలకే పెద్ద పీట వేయడం కాకుండా.. ఈసారి బీసీలకు టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే కాంగ్రెస్ తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు.