సెలబ్రిటీ ఐఏఎస్ అమ్రపాలీ బదిలీ .. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా ఉత్తర్వులు
అమ్రపాలి కాటా ... ఐఏఎస్ లు ఎంతోమంది ఉన్నా ఆమెకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. వరంగల్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో ఆమె ఎప్పుడూ వార్తల్లోనే ఉండేది . మహిళా ఐఏఎస్ అధికారుల్లో సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న అధికారిణి అమ్రపాలి . ట్రైనీగా తెలంగాణాకు వచ్చి తెలంగాణా రాష్ట్రంలో వివిధ పదవుల్లో పని చేసిన ఆమె ఇప్పుడు హైదరాబాద్ కు దూరం కానున్నారు. కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యిందా లేదా ? కేంద్ర మంత్రి చెప్పింది నిజమేనా ?
సెలబ్రిటీ ఐఏఎస్ అమ్రపాలి ... తక్కువ కాలంలో ఎక్కువ వార్తల్లో ఉన్న ఐఏఎస్ అధికారిణి
ట్రైనీ ఐఏఎస్ గా హైదరాబాద్ కు వచ్చినప్పుడే ఆమె మీడియాలో ప్రముఖంగా కనిపించేవారు. ఆమె తనపని తాను చేసుకుంటూ పోతున్నా మీడియా దృష్టి మాత్రం అమ్రపాలి కాటా మీద ఉండేది . మిగిలిన ఐఏఎస్ లతో పోలిస్తే ఆమె తీరు భిన్నంగా ఉండటమే కారణంగా కొందరు చెబుతుంటారు. ఒక కలెక్టర్ లా హుందాగా అనే కంటే ఓ స్టూడెంట్ లా జోవియల్ గా కనిపించేవారు అమ్రపాలి. ఇక ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ ఆకట్టుకునేది. యూత్ ఐకాన్ లా కనిపించే ఆమె పై యూత్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అందరితోనూ స్నేహంగా ఉండటం, ముక్కుసూటిగా వ్యవహరించటంతో పాటు,యాక్టివ్ గా ఉండేవారు అమ్రపాలి. తక్కువ కాలంలోనే సెలబ్రిటీ ఐఎఎస్ గా మారిపోయారు. ఏకంగా వినాయకచవితికి ఆమె విగ్రహాన్ని చేయించి ఆమె ఒడిలో వినాయకుడిని పెట్టి యూత్ హంగామా చెయ్యాలని చూసారు అంటే ఎంతగా అమ్రపాలి క్రేజ్ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు .ఇక వరంగల్ లో పని చేసిన సమయంలో ఆమెకు మంచి పేరే కాదు , చెడ్డ పేరు కూడా అంతే బాగా వచ్చింది. ఆమె తరచూ మీడియాలో నానుతూ ఉండేవారు.
వరంగల్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో బోలెడు విమర్శలు .. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా విధులు
క్యాంప్ ఆఫీస్ మూసివేసి విమర్శలు ఎదుర్కోవటం , జీన్స్ వేసుకుని గుడికి వెళ్ళటం , కేటీఆర్ వచ్చినప్పుడు ఆమె ప్రవర్తనా తీరు ,ఆమె బస చేసిన కలెక్టర్ బంగ్లాలో దెయ్యం ఉందని చెప్పటం , రాత్రిళ్లు పడుకోవాలంటే భయంగా ఉంటుందన్న వ్యాఖ్య చేయటం పెను సంచలనంగా మారింది. ఇక ఏదో విధంగా ఆమె గురించి వార్తలు రావటంతో అమ్రపాలికి సంబంధించి ఏదో ఒక అంశం వార్తల్లో ప్రముఖంగా రావటంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తితో వరంగల్ కలెక్టర్ గా పని చేస్తున్న ఆమెను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా అప్రాధాన్య పదవికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇకబదిలీకి కాస్త ముందే ఆమెకు వివాహమైంది. జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె పెద్దగా వార్తల్లో కనిపించని పరిస్థితి.
బదిలీపై కేంద్ర సర్వీసుల్లోకి .. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా నియామకం
ఇలాంటివేళలో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. హైదరాబాద్ కు గుడ్ బై చెప్పనున్నారు . కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఆమెను బదిలీ చేశారు . ఢిల్లీ కేంద్రంగా కిషన్ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆమెను కేంద్ర సర్వీసులోకి పంపాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తమానం అందింది. మొత్తానికి సెలబ్రిటీ ఐఏఎస్ అమ్రపాలి ఇప్పుడు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఓఎస్డీగా తన విధులను నిర్వర్తించనున్నారు. తెలంగాణాకు దూరమైనా , కిషన్ రెడ్డి ఓఎస్డీగా తెలంగాణాకు దగ్గరగానే ఉంటారని భావించాలి.