డ్రైవర్ నాగరాజు హత్య: పోలీసులపై ఐఎఎస్ సంచలన ఆరోపణలు
నాగరాజు హత్య కేసుకు సంబంధించిన ఐఎఎస్ అధికారి వెంకటేశ్వర రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. రెండు రోజుల పాటు పోలీసులు ఏం చేశారని అడిగారు.
హైదరాబాద్: తన భార్య అనిత డ్రైవర్ నాగరాజు హత్య కేసుకు సంబంధించి ఐఎఎస్ అధికారి వెంకటేశ్వర రావు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. నాగరాజును హత్యపై ఆయన కుమారుడు వెంకట్ సుక్రుత్పైనే కాకుండా తనపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆయన స్పందించారు.
రూ. 2 కోట్లు ఇవ్వనందుకే తమను కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. నాగరాజు హత్య కేసులో ఆయన రెండో నిందితునిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం అరెస్టు చేసిన సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడిని మాత్రం రిమాండ్కు తరలించారు.
ఆస్పత్రిలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఎల ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. డ్రైవర్ నాగరాజు హత్య కేసులో తనకు ఏ సంబంధం లేకపోయినా పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికించారని, దీని వెనుక పెద్ద అవినీతి కుట్ర ఉందని ఆయన అన్నారు.
రూ. 2కోట్లు ఇస్తే కేసులో నుంచి తప్పిస్తామంటూ హైదరాబాదులోని పంజాగుట్ట సీఐ ద్వారా తనపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు అంగీకరించకపోవడంతో తనను కేసులో ఇరికించారని వెంకటేశ్వర రావు తెలిపారు. గదిలో బంధించిన హింసించినట్లు ఆరోపించారు.
తనను కేసులో ఇరికించడంలో పోలీసు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఒక్క మనిషి శవాన్ని ఎత్తుకు రాగలడా, తన కుమారుడు ఒక్కడితో శవాన్ని ఎత్తుకు రావడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కొట్టుకున్నామని తండ్రికి చెప్తాడా అని ఆయన ప్రశ్నించారు. తాగాం, కొట్టుకున్నామని ఓ కుమారుడైనా తండ్రికి చెప్తాడా అని ప్రశ్నించారు.
నాగరాజు తనకు సంబంధించిన డ్రైవర్ కూడా కాడని చెప్పాడు. అడగ్గా, అడగ్గా మందు తాగుదామని రా అని తనను నాగరాజు పిలిచినట్లు తన కుమారుడు చెప్పాడని ఆయన చెప్పారు. బాటిల్ తెచ్చి తన కుమారుడు కింది నుంచి తెచ్చి ఇచ్చాడని చెప్పారు. ఇంటికెళ్లి స్నానం చేసి నీళ్లు తీసుకుని వచ్చిన తర్వాత ఇద్దరు తాగారని ఆయన అన్నారు. ఆ తర్వాత ఏం గొడవ జరిగిందో తనకు తెలియదని అన్నారు.
తనపై కేసు పెట్టడానికి ఏ విధమైన శాస్త్రీయాధారం ఉందని ఆయన అడిగారు. మూడు రోజుల పాటు ఎందుకు బంధించాలని ఆయన అడిగారు. తన కుమారుడిని తాను అప్పగించానని, తనను ఎందుకు నిర్బంధించారని ఆయన అన్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారిపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.
తమ వద్ద వెంకటేశ్వరరావుకు సంబంంధించి నాగరాజు హత్య కేసులో స్పష్టమైన ఆధారాలున్నాయని పోలీసులు అంటున్నారు. శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు.