సర్కార్ వర్సెస్ ఐఏఎస్ .. పోస్టింగులు, లూప్ లైన్ లో పెట్టడంపై ఆగ్రహం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఐఏఎస్ లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విధాన నిర్ణయాలు తీసుకుంటూ .. ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన తమను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని భగ్గుమంటున్నారు. నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులను పక్కనపెడుతూ .. మాట చెప్పినవారినే అందలం ఎక్కిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రతి పథకం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం లేదని ఆరోపిస్తున్నారు.
బ్యూరోక్రాట్ల అసంతృప్తి
రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ సర్కార్ పై సివిల్ సర్వీసెస్ అధికారులే పెదవి విరుస్తున్నారు. విధానపర నిర్ణయాల్లో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో సత్ఫలితాలు వచ్చి, అవి దీర్ఘకాలికంగా మనగలుగుతాయని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీఆర్ఎస్ సర్కార్ పెద్దల తీరు ఇందుకు విరుద్ధంగా ఉండడంతో సమస్య వచ్చిపడింది. ఐఏఎస్ పోస్టింగులు ఇవ్వడంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండేవారికి అందలం, నిబంధనల మేరకు పనిచేసేవారికి చిన్నచూపు చూస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ట్రైనీ ఐఏఎస్ లకు కూడా పోస్టింగ్ లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, బ్యూరోక్రాట్ల మధ్య నెలకొన్న ఈ గ్యాప్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది.
ట్రైనీ ఐఏఎస్ లకు నో పోస్టింగ్స్ ..
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఐఏఎస్ పాత్ర కీలకం. ప్రభుత్వం చేపట్టే విధాన నిర్ణయాలు, పథకాలను రూపొందించడంలో వారిదే క్రియాశీలక పాత్ర. ఈ అంశాన్ని ఎవరూ కాదనలేరు. అయితే రాష్ట్రానికి కేటాయించిన యువ ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణంగా వారిని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లుగా, ఇతర ప్రత్యేక అధికారులుగా నియమిస్తారు. కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 10 మంది యువ ఐఏఎస్ అధికారులు పోస్టింగ్స్ ఎదురుచూస్తున్నారు. గత 5 నెలల నుంచి వారు ఖాళీగానే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలు 33 పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు పరిపాలన వికేంద్రకరణ కోసం సివిల్ సర్వెంట్ల సేవలు అవసరం. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడంలో చూపించిన శ్రద్ధ ఆసక్తి .. ఐఏఎస్ లకు పోస్టింగులు ఇవ్వడంలో కనబరచకపోవడంతో వారు తమ పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు.
లూప్ లైన్ లో 20 మంది బ్యూరోక్రాట్లు
యువ ఐఏఎస్ ల సిచుయేషన్ ఇలా ఉంటే సమర్థమైన సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం లూప్ లైన్ లో పెట్టింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో మార్గదర్శకాలు, నిబంధనలు అంటూ గుర్తుచేయడమే వారి పాపమైంది. దీంతో తమ మాటను లెక్కచేయలేదని భావించిన సర్కార్ .. లూప్ లైన్ లో పెట్టింది. ప్రభుత్వంపై ఈ ఆరోపణలు గత మూడేళ్ల నుంచి వస్తున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు సీనియర్ అధికారులను పక్కనపెట్టి .. కిందిస్థాయి అధికారులకు ఇంచార్జీ బాధ్యతలు చేపట్టి ఇస్టానుసారం ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలుకుబడి వ్యక్తులకు. కార్పొరేట్లకు, ఎంఎన్సీ కంపెనీలకే లాభం జరుగుతోందని గుర్తుచేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పథకాల అమలుతీరును నాన్ ఐఏఎస్ లకు కేటాయించడం .. వారు రాజీపడటంతో విలువైన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని గుర్తుచేస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎస్ కే సింగ్ పరిపాలన అంశాలకు సంబంధించన అభ్యంతరాలను సీఎం కేసీఆర్ ముందే వ్యక్తం చేశారు.
వ్యక్తి పూజకే ప్రయారిటీ ..
బ్యూరోక్రాట్ల కేటాయింపులో ప్రభుత్వం సీనియారిటీ, సమర్థత కాకుండా .. వ్యక్తిపూజకే ప్రాధాన్యం ఇస్తోందని ఐఏఎస్ లు మండిపడ్డారు. ప్రభుత్వ విధాన పథకాల అమలులో కూడా తమపై ఒత్తిడి ఉంటుందని .. మాట వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ఇతర పార్టీ నేతల మాట వినొద్దని భయపెడుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించడంలో .. ఖజానాకు నష్టం జరుగకుండా చూడటంలో .. ప్రజలకు, సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో తమ బాధ్యతని .. ఈ క్రమంలో కఠినంగా ఉంటే తమకు మాటమాత్రం చెప్పకుండా బదిలీ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. మాట పెడచెవిన పెట్టే ఐఏఎస్ లకు పోస్టింగే లేకుండా చేయడం తగదంటున్నారు.
బ్యూరోక్రాట్లలో కేటాయింపులోనూ కులజాఢ్యం ..
ఐఏఎస్ .. అఖిల భారత సివిల్ సర్విసెస్. దేశంలో ఉన్నతమైన కొలువు. వీరి సమర్థత, నిబద్ధత ఆధారంగానే ఆయా పథకాలు, సేవల వల్ల ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతోంది. కానీ రాష్ట్రంలోని బ్యూరోక్రాట్లలో కూడా కులం ఆధారంగా పోస్టింగులు కేటాయిస్తున్నారనే అంశం సర్వత్రా కలకలం రేపుతోంది. దీనికి ప్రగతిభవన్, సచివాలయం, సీఎం పేషీ, హెచ్ వో డీ పోస్టింగుల్లో కూడా అగ్రకులాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేస్తూ .. తప్పు ఒప్పులను ఎత్తిచూపేవారిని లూప్ లైన్ లో పెడుతూ .. ప్రాధాన్యం తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అధికారలు విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కీలకశాఖలు అప్పగించడం లేదని .. సీఎస్, డీజీపీ స్థాయి పోస్టులకు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో ఐఏఎస్ ల కొరత ..
ఏ వైపు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సమస్య ఉన్నది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలాసార్లు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో యూపీఎస్సీ, డీవోపీటీకి లేఖలు రాశారు. దీనిని ఐఏఎస్ సంఘం తప్పుపడుతోంది. ఉన్న అధికారులకు పోస్టింగులు ఇవ్వరు కానీ .. మిగతా అధికారులు ఎందుకు ప్రశ్నిస్తోంది. జూనియర్ ఐఏఎస్ లు వెయిటింగ్ లో .. సీనియర్ అధికారులు లూప్ లైన్ లో ఉంచడంతో 30 మంది అధికారుల సేవలు తీసుకోలేకపోతుందని చెప్తున్నారు. వారికి పోస్టింగులు ఇచ్చాక .. మిగతా అంశం గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు.