కుప్పకూలిన ఐడియా నెట్వర్క్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఉదయం కలకలం రేగింది. ఐడియా నెట్వర్క్కు చెందిన సెల్ఫోన్లు మూగబోయాయి. రెండు రాష్ట్రాల్లో కూడా ఐడియా సెల్యులార్ నెట్వర్క్కు సంబంధించిన ఏ ఒక్క వినియోగదారుడి ఫోన్ పనిచేయలేదు. వివరాల్లోకి వెళితే... శనివారం ఉదయం ఉన్నట్టుండి ఐడియా నెట్వర్క్ కుప్పకూలింది.
దీంతో సిగ్నల్స్ లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు కస్టమర్ కేర్ నెంబర్లకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే కస్టమర్ కేర్ నెంబర్లు కూడా పనిచేయలేదు. ఐడియా నెట్ వర్క్ వినియెగిస్తున్న మొబైల్ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఒక్కసారిగా ఐడియా నెట్వర్క్ నెట్వర్క్ ఆగిపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐడియా నెట్వర్క్ కుప్పకూలడానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై ఐడియా నెట్వర్క్ ప్రతినిధుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు.
నగరంలోని కొంతమంది వినియోగదారులు మాత్రం సిగ్నల్స్ వచ్చి వెంటనే పోతున్నాయని, కాల్స్ కూడా వెంట వెంటనే కట్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఐడియా సర్వీసుల సేవల పునరుద్ధరణ కోసం యాజమాన్యం ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం.
అందుబాటులోకి వచ్చిన ఐడియా సిగ్నల్స్
తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిలిచిపోయిన ఐడియా సెల్ ఫోన్స్ సిగ్నల్స్ మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం ఉన్నట్టుండి ఐడియా సెల్యులార్ నెట్వర్క్ కుప్పకూలిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల పరిధిలోని ఐడియా ఫోన్లు పనిచేయడం మానేశాయి. దీంతో వినియోగదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఐడియా యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నెట్వర్క్ నిలిచిపోవడానికి గల కారణాలను కనుగొని పునరుద్ధరించింది. దీంతో దాదాపు 2 గంటల పాటు నిలిచిపోయిన సిగ్నల్స్ మళ్లీ సెల్ ఫోన్లలో ప్రత్యక్షమయ్యాయి.