కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టే ...5 లక్షల మెజార్టీ తో గెలిపించే బాధ్యత మీదే అన్న కేటీఆర్
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం పూరించింది. ఓరుగల్లులో గులాబీ దళం కదం తొక్కింది. వరంగల్ లో ఎన్నికల సమర శంఖారావం లో పాల్గొన్న కేటీఆర్ వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సభలో పాల్గొన్నారు . పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రసంగం చేశారు . వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల నుండి భారీగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలి వచ్చారు.
వరంగల్ నగరంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమాయత్త సభలను నిర్వహిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బైక్ ర్యాలీలతో అట్టహాసంగా ఘన స్వాగతం పలికారు ఓరుగల్లు గులాబీ దండు .ఓరుగల్లు మొత్తం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైనట్టు గులాబీ మయంగా మారింది. ఓరుగల్లు పార్లమెంట్ నియోజకవర్గంలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైనా ఉంది అని అన్నారు కేటీఆర్ .
భారతదేశంలోని రాజకీయ వ్యవస్థ మొత్తం దృష్టి కేసీఆర్ పైనే ఉంది అని రాజకీయ ప్రత్యర్ధులు సైతం చెప్తున్నారన్నారు . రైతు సంక్షేమంకోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అటు బీజేపీ, ఇటు రాజకీయంగా బద్ధ శత్రువుగా భావించే టీడీపీ సైతం ఫాలో చేస్తున్న పరిస్థితి ఉందన్నారు . కేసీఆర్ సంక్షేమ పథకాలపై ప్రజలు సైతం సంతోషంగా ఉన్నారన్న ఆయన దేశం మొత్తం చూస్తున్న ప్రత్యామ్నాయం కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణా ప్రభుత్వ రాజముద్రలో కాకతీయ కళా తోరణం చిహ్నంగా ఉందంటే అది వరంగల్ జిల్లా మీద కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పారు.
హైదరాబాద్ తర్వాత వరంగల్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోయేలా లెక్కలేనన్ని నిధులిస్తున్నారని , సజీవ జల దృశ్యాన్ని కేవలం సంవత్సర కాలంలోనే ఓరుగల్లు వాసులకు చూపిస్తామని హామీ ఇచ్చారు. రైతు కుటుంబాలకు ధీమా నిచ్చి రైతు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మన పధకాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మమతా బెనర్జీ , నవీన్ పట్నాయక్ వంటి నాయకులు తెలంగాణా పథకాలను కాపీ కొడుతున్నారన్నారు.
ఈ ఎన్నికలు మోడీ కి రాహుల్ గాంధీకి మధ్య జరిగే యుద్ధం కాదని దేశం కోసం పని చేసే ప్రాంతీయ పార్టీల నాయకులు చాలా మంది ఉన్నారన్నారు కేటీఆర్ . కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అడ్రెస్ లేకుండా పోయింది. అలాగే బీజేపీ సైతం ఉనికి కోల్పోయిందన్న కేటీఆర్ ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల హవానడుస్తుంది అని చెప్పారు . పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ , పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోసం చేసిన కారణం గా అయినా కేంద్రానికి బుద్ధి చెప్పాలని ఆనారు.
తెలంగాణా సత్తా చాటేలా 16 స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్ర సర్కార్ ను నిర్ణయించే శక్తి తెలంగాణాకు వస్తుందని కేటీఆర్ అన్నారు. అప్పుడు నిధులు ఎలా రావో చూస్తామని అన్నారు కేటీఆర్. దేశంలో రానున్న ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుతం ఏర్పాటు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో కేసీఆర్ నాయకత్వం కీలకంగా మారనుందని చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ ... ఢిల్లీ నుండి పర్మిషన్ ఇస్తేనే బాత్ రూమ్ కైనా వాళ్ళు పోయేది అని , రాహుల్ గాంధీ కూర్చోమంటే కూర్చునే , నిల్చోమంటే నిల్చునే వారికి ఓటేస్తే మోరిలో వేసినట్టేనని కేటీఆర్ తెలిపారు .
ఇక పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ నేలవిడిచి సాము చెయ్యొద్దని , గ్రామ గ్రామానా అప్రమత్తంగా ఉండాలని , లోక్ సభ ఎన్నికల తరువాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని కాబట్టి క్షేత్ర స్థాయిలో బలంగా ప్రచారం ఇప్పటి నుండే చేస్తే లోక్ సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించవచ్చని ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.