కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతున్నారు అన్న వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ సీఎం అయితే ఏం జరుగుతుందో చెప్పారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రంలో అణుబాంబు పేలుతుందని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూడు రోజులుగా కేసీఆర్ దోష నివారణ పూజలు .. కేటీఆర్ సీఎం కావాలనే కాళేశ్వరం టూర్ : బండి సంజయ్ సంచలనం
కాకా కాళేశ్వరం టూర్ అందుకోసమే .. మరోసారి కేసీఆర్ టూర్ పై బండి సంజయ్
సీఎం కేసీఆర్, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజలు చేసి ,ఆ ద్రవ్యాలను కలపడానికి కాళేశ్వరం వెళ్లారని, కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో వాటిని కలిపారని మరోమారు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కాకా పర్యటన చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కెసిఆర్ పై అసహనంతో పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ పార్టీ మారతారా అన్న అనుమానంతోనే కేటీఆర్ ని సీఎం చేస్తానని డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
రక్తపుమడుగులో రాజ్యమేలుతున్న కేసీఆర్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదు
రక్తపుమడుగులో రాజ్యమేలుతున్న కేసీఆర్ తో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ మండిపడ్డారు. అంతేకాదు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడాన్ని టిఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్న ఆయన కేటీఆర్ సీఎం అయితే అణు బాంబు పేలుతుంది అని చేసిన వ్యాఖ్యల ఆంతర్యం పరోక్షంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ లోని చాలామంది నేతలు ఇప్పటికే కెసిఆర్ తీరుతో అసహనంతో ఉన్నారని, కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేలా లేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
యాక్షన్ లో కేసీఆర్ ను మించిన నటుడు లేడు
ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అగ్రవర్ణాల పేదలకు రెండేళ్లపాటు అమలు చేయకుండా తాత్సారం చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ,ముక్కు నేలకు రాయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎవరికీ నష్టం లేదని పేర్కొన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ ఎత్తుగడలు దేనికోసమో అందరికీ తెలుసన్నారు .యాక్షన్ లో కెసిఆర్ ని మించిన నటుడు లేడని, సీఎం కేసీఆర్ ని పెట్టి సినిమా ఇస్తే 20 గంటల్లోనే పూర్తవుతుందని, అంత గొప్ప నటుడు కెసిఆర్ అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ , టీఆర్ఎస్ రెండూ తోడు దొంగలే
కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలేనని పేర్కొన్న బండి సంజయ్ తాము టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. కోటిలో ధర్నా చేస్తున్న స్టాఫ్ నర్సులపై లాఠీ ఛార్జ్ చేయడం అమానుషమని పేర్కొన్న బండి సంజయ్, స్టాఫ్ నర్సుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.