తల కొట్టేసినా భయపడేది లేదు..! కేసీఆర్ అక్రమాలపై స్పందిస్తూనే ఉంటానన్న రేవంత్ రెడ్డి..!
హైదరాబాద్: ఈడి విచారణ తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మునుపటి మాదిరిగానే ఘాటు విమర్శలు చేసారు. చివరి శ్వాస ఉన్నంత వరకూ చంద్రశేఖర్ రావు పై స్పందిస్తూనే ఉంటానని అన్నారు అంతే కాకుండా తనను జైలుకు పంపడం మినహా చంద్రశేఖర్ రావు ఇంకేం చేయగలరని స్పందించారు. మూడు గదుల్లో మార్చి మార్చి రేవంత్ను విచారించిన ఈడి అదికారులు అనేక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు, మరో నిందితుడిగా ఉన్న ఉదయ సింహను ఇప్పటికే ఈడీ విచారించింది. ఇపుడు రేవంత్ రెడ్డిని విచారిస్తోంది ఈడి. విచారణ తర్వాత రేవంత్ రెడ్డి చంద్రశేఖర్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
కర్మ కాలిన రోజు కేసీఆర్ ఊచలు లెక్కపెడతాడు..! మోదీ కూడా ఏం చేయలేడన్న రేవంత్..!!
తల తెగి పడ్డా సీఎం కేసీఆర్ ఆక్రమాలపై మాట్లాడకుండా ఉండనని రేవంత్ రెడ్డి తెలిపారు .తన కర్మ కాలిన రోజు తాను ఊచలు లెక్కపెడుతాడని, అప్పుడు ప్రధాని మోదీ కూడా అపలేడు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును హెచ్చరించారు. శాసనసభ ఎన్నికలప్పుడు ఐటి అధికారులను ప్రయోగించారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఈడీని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, మోదీ, కేసీఆర్ లది విడదీయరాని బంధమన్నారు రేవంత్ రెడ్డి.
మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం..! వేధించడమే వారికి తెలిసిన విద్యన్న రేవంత్ రెడ్డి..!!
ఈడీ కార్యాలయంలో సుమారు ఎనిమది గంటల పాటు రేవంత్ రెడ్డిని అధికారులు విచారించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, మళ్లీ విచారణకు రమ్మన్నారని రేవంత్ చెప్పారు. విచారణకు హాజరై అన్ని సమాదానాలు చెబుతానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏసీబీని ఉపయోగించి కేసీఆర్ గెలిచాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో అనేక ఆక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు.
వ్యక్తులు నచ్చకపోతే విచారణ సంస్థలతో వేధింపులు..! రేవంత్ సూటి ప్రశ్న..!!
కేవలం ఆరోపణలు మోపబడిన వ్యక్తులపై మోదీ మోజు పడి కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్ది విచారిస్తున్నారని అన్నారు. చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరుపుతున్నారని అన్నారు. విచారణ పూర్తయిన తర్వాత మూడో కృష్ణుడు అయిన ఈడీ ఏం తేల్చుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వేం నరెందర్ రెడ్డి కుమారులను ఎందుకు పిలిచారో తెలియడం లేదన్నారు. వారికి రాజకీయ సంబంధాలు లేనప్పటికీ, వారిని పిలిచి మా కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గులాబీ నేతలకు ఒక న్యాయం..! ప్రతిపక్ష నేతలకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్న రేవంత్..!!
అధికారంలో ఉన్న కొద్ది మంది పెద్దలు చేస్తున్న ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలన్నారు.కొడంగల్ లో నా మీద పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి వద్ద పోలింగ్ కు కొద్ది రోజుల ముందు 50 లక్షల రూపాయలు దొరికాయని, ఈ కేసును ఈడీ, సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ లపై వ్యతిరేకంగా పోరాడుతున్నవారిపైనే దర్యాప్తు సంస్థలు వేదిస్తున్నాయన్నాయని, ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.