ఐసా నహీ చెలేగా!: నిజామాబాద్ సీపీకి ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోన్(వీడియో)
నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ.. మైక్లో వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఓవైసీకి ఎందుకిచ్చారు?
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పర్యటనకు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి అనుమతి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఓవైసీ వస్తే రాని లా అండ్ ఆర్డర్ సమస్య.. రాజా సింగ్ వస్తే ఎలా వస్తుందని ఎంపీ ధర్మపురి అరవింత్ సీపీని ప్రశ్నించారు. రాజా సింగ్ పర్యటనకు ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు.
ఐసా నహీ చెలేగా..
మీరు చెప్పినట్లుగా బీజేపీ నడుచుకోవాలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీని లేకుండా చేయలని భావిస్తున్నారా? అని సీపీని నిలదీశారు ఎంపీ. మీరు చెప్పినట్లుగా బీజేపీ నడవదని స్పష్టం చేశారు. రాజా సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని మీరు ఎలా అడ్డుకుంటారని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. బైంసాలో అల్లర్లకు ఎవరు కారణమో తెలియదా? తమ దగ్గర వీడియో ఆధారాలున్నాయి.. కావాలంటే మీకు పంపిస్తా అని సీపీకి అరవింద్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్, కవితపై తీవ్ర విమర్శలు
అంతేగాక, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం చేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్ను ఆయన కొడుకు కూతురు కేటీఆర్, కవిత కలిసి చరిత్ర హీనుణ్ని చేశారని విమర్శించారు. కేటీఆర్ ఓ అహంకారి, సన్నాసి, రాజకీయ అజ్ఞాని అని తిట్టిపోశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను విమర్శించే స్థాయి ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. వాళ్ల కాలి గోటికి సరిపోతాడా? అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని కేటీఆర్ ను హెచ్చరించారు.
బైంసా ఘటనపై..
టీఆర్ఎస్ నేతలు, ఎంఐఎంతో కలిసి హిందువులపై దాడులు చేస్తున్నారని అరవింద్ ఆరోపించారు. బైంసాలో హిందువుల ఇల్లు తగలబెడితే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని అరవింద్ ప్రశ్నించారు. బైంసాలో అరాచకం చేయడానికి కేసీఆర్, పోలీసులు సహకరించారని ఆరోపించారు. బైంసా ఘటనను ప్రసారం కాకుండా మీడియాని నియంత్రించారని అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేయబోమని చెబుతున్న హోంమంత్రి మహమూద్ అలీని జైల్లో వేస్తామని అన్నారు.