పవన్ కల్యాణ్కు వీహెచ్ బంపరాఫర్.. వీహెచ్కు మాణిక్కం షాక్.. సాగనంపే యోచన?
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎంపీ రేవంత్ రెడ్డి,పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్ ఆయనపై చర్యలకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వీహెచ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆయన బంపరాఫర్ ఇచ్చారు.
పవన్కు బంపరాఫర్...
పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు ఏపీలో పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని వి.హనుమంతరావు ప్రకటించారు. వంగవీటి రంగా తర్వాత పవన్ కల్యాణ్కు మంచి వేవ్,ఫాలోయింగ్ ఉందన్నారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు.సూర్యాపేట జిల్లా దొండపాడులో వీహెచ్ వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంగవీటి రంగా ఎక్కడ సీఎం అవుతాడేమోనన్న భయంతోనే ఆనాడు ఆయన్ను హత్య చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో కేవలం 3శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. బీసీలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వీహెచ్ పేర్కొన్నారు. ఆ బెదిరింపులకు తాను భయపడనని... పార్టీ కోసం ప్రాణం పోయినా లెక్క చేయనని అన్నారు.
వీహెచ్ను సాగనంపే యోచన...
మరోవైపు వీహెచ్ వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇన్చార్జి కార్యదర్శిగా ఉన్న బోస్ రాజుకు ఫోన్ చేసి వీహెచ్ వ్యాఖ్యలపై ఆయన నివేదిక కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ సీనియర్లతో చర్చించి వీహెచ్కు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాను అమ్ముడు పోయానంటూ వీహెచ్ చేసిన ఆరోపణలను మాణిక్కం ఠాగూర్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే వీహెచ్ను పార్టీ నుంచి పంపించేందుకు కూడా ఆయన సిద్దమవుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్లో కొనసాగుతున్న రచ్చ...
రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇవ్వబోతున్నారన్న లీకులు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా పార్టీ సీనియర్లు రేవంత్ పట్ల బాహాటంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీహెచ్ శుక్రవారం(డిసెంబర్ 25) రేవంత్,మాణిక్కం ఠాగూర్లపై తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేశారు.ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రేవంత్ లాంటి నేతలకు పీసీసీ పదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అదే జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. ఎంతసేపు రెడ్డి సామాజికవర్గానికే పెద్ద పీట వేయడం తప్ప బీసీలకు అవకాశం ఇవ్వరా అని నిలదీశారు. ఒకవేళ మళ్లీ రెడ్డి వర్గానికే అవకాశమిచ్చినా మొదటినుంచి పార్టీలో ఉన్నవారికే అవకాశం ఇవ్వాలన్నారు. అంతేకాదు,పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. రేవంత్కు అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించిన ఆయన... దానిపై సీబీఐకి లేఖ రాస్తానన్నారు. వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.