వీలైతే మళ్లీ హైదరాబాద్ వస్తా: సీఎం కేసీఆర్కు ఇవాంకా ట్రంప్ లేఖ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. జీఈఎస్లో పాల్గొన్న సందర్భంగా ఫలక్నుమా ప్యాలెస్లో ఇచ్చిన విందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్లో ఇవాంకా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఇవాంకాకు పాతబస్తీలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. నిజాం కాలంనాటి అతి పొడవైన డైనింగ్ టేబుల్పై ఈ విందులో ఇవాంకా పాలుపంచుకున్నారు.
అంతకుముందు ఆమెకు మహారాణి స్థాయిలో స్వాగతం పలికారు. ప్యాలెస్ గేటు దగ్గర్నించి గుర్రపు బగ్గీలో ఆమెను ప్యాలెస్ వద్దకు తీసుకెళ్లారు. ఈ రాచమర్యాదలకు ఇవాంకా అప్రతిభురాలయ్యారు.
నాటి ఆతిథ్యానికి ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాంకా సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన తీరు అనిర్వచనీయం, స్పూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. అవకాశం దొరికితే మరోసారి హైదరాబాద్ వస్తానని, ఫలక్నుమా ప్యాలస్లో అందించిన కానుక మంచి అనుభూతిని ఇచ్చిందని ఇవాంకా తెలిపారు.