దుబ్బాకలో రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్లో చేరుతాడు... టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు...
దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిస్తే... ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీశ్ రావు,రఘునందన్ రావు ఇద్దరు అన్నదమ్ములని... బీజేపీకి ఓటు వేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్కు బుద్ది చెప్పాలని... దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలని అన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి ఇప్పటికే చాలాసార్లు మోసపోయిన దుబ్బాక ప్రజలు... ఈసారి కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డిని గెలిపించాలని దుబ్బాక ప్రజలకు పిలుపునిచ్చారు.
దుబ్బాకపై వివక్ష చూపించారు : ఉత్తమ్
అంతకుముందు ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ... దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. జనంలో టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. దుబ్బాకలో ప్రతీ కుటుంబం సీఎం కేసీఆర్ తమను మోసం చేశారని చెప్తున్నారన్నారు. ప్రాజెక్టుల కోసం జరిపిన భూసేకరణలో భాగంగా సిద్దిపేట,గజ్వేల్లో భూనిర్వాసితులకు ఎకరాకు రూ.18లక్షలు చొప్పున ఇచ్చిన ప్రభుత్వం,దుబ్బాక ప్రజలకు మాత్రం రూ.1లక్ష 80వేలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు.
స్వయంగా రామలింగారెడ్డే వాపోయారు : ఉత్తమ్
దుబ్బాకకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం,పాలిటెక్నిక్ కాలేజీలను సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. నాలుగేళ్ల నుంచి 100 పడకల ఆస్పత్రి ఇంకా నిర్మాణ దశలోనే ఉందన్నారు. దుబ్బాక ప్రజలు తమ తరుపున ప్రశ్నించే గొంతుకను కోరుకుంటున్నారని... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించబోతున్నారని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి... తాను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా... తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోలేకపోతున్నానని,స్వయంగా అసెంబ్లీ వాపోయారని పేర్కొన్నారు.
దుబ్బాక నిర్లక్ష్యానికి గురైంది..
అటు బీజేపీ,ఇటు టీఆర్ఎస్ దుబ్బాకలో డబ్బులతో పట్టుబడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారని స్వయంగా వాళ్ల పార్టీ నేత కమలాకర్ రెడ్డే ఆరోపిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్,బీజేపీలకు ప్రజలు బుద్ది చెప్పబోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్ల పంట భీమా పోయిందన్నారు. నిరుద్యోగ యువత కూడా చాలా అసంతృప్తితో ఉన్నారని.. మొత్తంగా దుబ్బాక ప్రజల్లో నిర్లక్ష్యానికి గురయ్యామన్న ఆవేదన కనిపిస్తోందని చెప్పారు.