విజయనగరంలో గిరిజన టీచర్ ఆత్మహత్య: కలకలం: సీబీఐ విచారణకు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
విజయనగరం: విజయనగరంలో ఓ గిరిజన ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మూడు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఆ ఉపాధ్యాయుడిది ఆత్మహత్య కాదని, ఎవరైనా హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. సీబీఐ విచారణ జరిపిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ విచారణతోనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పట్టుబడుతున్నారు.
జస్టిస్ ఫర్ అర్జున్ మీనా పేరుతో ట్రెండ్..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ మిస్టరీ కేసుతో విజయనగరం గిరిజన ఉపాధ్యాయుడి కేసుతో పోల్చుతున్నారు. ఈ ఘటనపై ఏపీ, తెలంగాణ సహా ఆ ఉపాధ్యాయుడి స్వరాష్ట్రం రాజస్థాన్లో కలకలం చెలరేగుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు తరహాలోనే ఆ గిరిజన ఉపాధ్యాయుడి మరణంపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చెబుతున్నారు. #JusticeforArjunMeena అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం ఈ ఘటనపై స్పందించారు.
రాజస్థాన్కు చెందిన గిరిజన టీచర్..
సుశాంత్ సింగ్ కేసును బిహార్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ గిరిజన ఉపాధ్యాయుడి పేరు అర్జున్ కుమార్ మీనా. ఆయన స్వరాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా గంగాపూర్ సిటీలోని వసుంధరా కాలనీలో నివాసం ఉంటున్నారు. కేంద్రీయ విద్యాలయాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2017లో విజయనగరంలోని కేంద్రీయ విద్యాలయాకు బదిలీ అయ్యారు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన తన నివాసంలో నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
మృతదేహంపై రక్తపు మరకలు..
అర్జున్ కుమార్ మీనా అనుమానాస్పద మృతిలో మరణించినట్లు కేసు నమోదు చేసుకున్నారు. విజయనగరం టౌన్ ఎస్ఐ నారాయణ రావు సారథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా- ఆయన మృతదేహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మృతదేహం వెనుకభాగం మొత్తం రక్తపు మరకలు కనిపించాయి. రక్తం ధారగా కారిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆయన ధరించిన ప్యాంటు కూడా చిరిగిపోయి కనిపించింది. ఆయనది ఆత్మహత్య కాదని, హత్యేననే డిమాండ్ వినిపిస్తోంది. గిరిజన సంఘాలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Recommended Video
సీతక్క సహా రాజస్థాన్ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు
తెలంగాణలోని ములుగు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం అర్జున్ కుమార్ మీనా ఆత్మహత్య ఘటనపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఆయన మరణం వెనుక వాస్తవాలు ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ పోలీసులకు దాన్ని ట్యాగ్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉదంతాన్ని సీబీఐకి అప్పగించినప్పుడు అదే తరహాలో అనుమానాస్పదంగా మరణించిన అర్జున్ కుమార్ మీనా కేసును కూడా ఎందుకు సీబీఐకి అప్పగించకూడదని ప్రశ్నించారు. రాజస్థాన్ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు ఆజాద్ అనిల్ ఢెన్వాల్ సహా రాజస్థాన్కు చెందిన పలువురు నెటిజన్లు ఇదే డిమాండ్ చేస్తున్నారు.