రూ. 2 వేలు కోట్లిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉపఎన్నిక ఉన్న హుజూరాబాద్లో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఒకవేళ మునుగోడు నియోజకవర్గానికి రూ. 2 వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు ఇవ్వట్లేదని రాజగోపాల్ అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే నిధులిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారని, ఇతర చోట్ల మాత్రం 100 కుటుంబాలకే ఇస్తామనడం సబబా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ సర్కారు ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Recommended Video
దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేస్తున్నారని సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు అని అన్నారు. సూర్యపేట జిల్లా హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందన్నారు. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ను ఇజ్రాయిల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీల, ఇతర సంస్థలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని కేసీఆర్ని చెప్పమనండని సవాల్ విసిరారు. కేసీఆర్కు తన సొంత పార్టీ నాయకుల మీద నమ్మకం లేక వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తున్నాడని అన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, హుజూర్నగర్లలో పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారని అన్నారు.