అలా జరగకపోతే రాజీనామా చేస్తా.!కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.!
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలబడింది కాబట్టే స్థానిక ప్రజా ప్రతినిధులకు విలువ పెరిగిందని అన్నారు. 230 కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసారు.
అందరినీ ఒప్పించి అభ్యర్దిని బరిలో దించాం కాబట్టి గెలుపోటముల బాద్యత తానే తీసుకుంటానని, ఎమ్మెల్యే పదవికి మాత్రమే పరిమితం అవుతానని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓట్లలతో పాటు టీఆరెస్, బీజేపీ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు. జిల్లాలోని 230మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఓట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే పడతాయని, ఒకవేళ 230 ఓట్లలో ఒక్క ఓటు తక్కువ పోలైనా వర్కింగ్ ప్రసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు జగ్గారెడ్డి.
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో పార్టీ తరపున ఎంఎల్సీగా తన భార్య నిర్మలా జయప్రకాశ్ రెడ్డిని పోటీలో నిలబెట్టడం జరిగిందన్నారు జగ్గారెడ్డి. జిల్లాలో బలంగా ఉన్న పార్టీ కాడర్ ను కాపాడుకోవడంతో పాటు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ని గెలిపించకూడదనే ఎంఎల్సీ అభ్యర్థిని పోటీలో ఉంచడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 1027 మంది స్థానికసంస్థల ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని కోరుతునన్నారు జగ్గారెడ్డి. ఎన్నికల సమయంలో మాత్రమే స్థానిక సంస్థలకు నిధులిస్తామని హామీ ఇవ్వడం, ఆతర్వాత మర్చిపోవడం టీఆర్ఎస్ పార్టీ కి అలవాటేనని ఎద్దేవా చేసారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టిందని తెలిపారు. మంత్రి హరీష్ రావ్ ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ఇప్పటికే క్యాంప్ లకు తరలించారని, రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ 2023 లో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసారు. ఎంపీటీసిలకు,జడ్పీటీసీలకు తప్పకుండా నిధులు ఇస్తామని ప్రమాణాలు చేసి ఓట్లు వేయించుకోబోమని, తప్పకుండా గెలుస్తామనే ఆశ మాత్రం ఉందన్నారు జగ్గారెడ్డి.