బీజేపీలో అధికారంలోకి వస్తే... నామాలు తప్ప ఏమి ఉండదు .! సీఎం కేసీఆర్
ఇటివల టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపధ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ నేతలు పలు వేదికలపైన ప్రకటిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం వస్తుందో సీఎం కేసీఆర్ వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ చాల ప్రత్యేకంగా పారిపాలన కొనసాగుతుందని స్ఫష్టం చేశారు. ఏం లేనోనికి ఏతులు, నామాలు ఎక్కువ అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి చురకలు అంటించారు.
అధికారంలోకి వస్తామంటూ బీజేపీ ప్రచారం
ఇటివల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలిచిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా నిజామాబాద్ స్థానం నుండి సీఎం కేసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత ఓటమి పాలు కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు టీఆర్ఎస్పై విమర్శల బాణాలు తీవ్రతరం చేశారు. దీంతో రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ బ్రతికుండానే టీఆర్ఎస్ను చంపుతామన్న బీజేపీ ఎంపీ
ఇందులో భాగంగానే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అయితే ఒకడుగు ముందుకు వేసి సీఎం కేసీఆర్ బ్రతికి ఉండగానే టీఆర్ఎస్ ఆయన కళ్లముందే చంపి బొంద పెడతామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు అనుగుణంగానే పక్కా బీజేపీవాది అయిన గవర్నర్ను తెలంగాణలో దింపారనే విపరీత ప్రచారం చేస్తున్నారు. అధికారం కోసం బీజేపీ వ్యుహత్మకంగా పావులు కదుపుతుండడంతో భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం వస్తుంది...?
ఈ నేపథ్యంలోనే తెలంగాణపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. బీజేపీ ఇప్పటివరకు చేసిన అన్యాయంపై ఆయన వివరించారు. ఇందులో భాగంగానే బీజేపీ శుష్కప్రియాలు శూన్యహస్తాలు తప్ప తెలంగాణకు ఒక్క రుపాయి కూడ తెలంగాణకు ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందులో బాగంగానే ఐటిఐర్ ప్రాజెక్టుకు ఒక్కరుపాయి కూడ ఇవ్వలేదని చెప్పిన సీఎం బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరోగ్య శ్రీ పోయి అయూష్మాన్ భారత్ వస్తుందన్నారు. ఇక రైతుబంధు పథకం పోయి కిసాన్ సమ్మాన్ వస్తుంది. రాష్ట్రం అమలు చేస్తున్న రైతుభీమా కూడ పోతుంది. సన్నబియ్యం పథకం పోయి దొడ్డు బియ్యం వస్తాయని అన్నారు. ఇక కిసాన్ సమ్మాన్లో సమ్మాన్ తప్ప కిసాన్ ఉండడని అన్నారు.
నాందేడ్ ప్రజలు తెలంగాణలో కలుస్తామని చెబుతున్నారు..
ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వృద్యాప్య పెన్షన్లు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. అన్నింటికంటే ముఖ్యంగా మహారాష్ట్రాలోని నాందేడ్ జిల్లా ప్రజలు తెలంగాణలో కలుస్తామని ఆందోళన చేస్తున్నారని అన్నారు. బీజేపీ పరిపాలన అంత చక్కగా ఉంటే వాళ్లు ఎందుకు తెలంగాణలో కలుస్తామని చెబుతారని అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే అంత్యంత ఉత్తమమైన పాలన తెలంగాణలో కొనసాగుతుందని ఆయన వివరించారు.