అది లేకుంటే హైదరాబాద్లో హోటళ్లకు నీళ్లు బంద్:జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయం
హైదరాబాద్:వ్యర్థాల నియంత్రణపై జీహెచ్ఎంసీ సీరియస్ గా దృష్టి సారించింది. చెత్త,చెదారం ఉత్పత్తిని తగ్గించేందుకు అవకాశాలపై అధ్యయనం చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ ఎంసి) ఆ క్రమంలో సరికొత్త నిబంధనలను అమలులోకి తెస్తోంది.
అంతేకాదు వ్యర్థాల రీ సైక్లింగ్, పునర్వినియోగమే లక్ష్యంగా ఆ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకించి హోటళ్లు, ఫుడ్ సెంటర్ ల నుంచి నిర్ణీత స్థాయి మించి ఉత్పత్తి అవుతోన్న వ్యర్థాలను కంపోస్ట్ చేయని ఆయా సంస్థలకు నీటి సరఫరా నిలిపివేయాలని జిహెచ్ఎంసి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వెంటనే కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని హెచ్చరించి , ఇందుకోసం 20 రోజులు గడువు ఇచ్చింది.
తమ పరిథిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, బాంక్వెట్ హాళ్లలో నిర్ణీత గడువులోగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు జిహెచ్ఎంసి అవకాశమిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2016 సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ప్రతి రోజూ 100 కిలోలు, అంత కంటే ఎక్కువ పరిమాణంలో చెత్త ఉత్పత్తి చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాలు, బాంక్వెట్ హాళ్లలో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరి.
ఆ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించిన జిహెచ్ఎంసి తాను విధించిన గడువులోగా నిర్ణీత ప్రమాణాల ప్రకారం సేంద్రియ ఎరువుల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దాన కిషోర్ హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటుచేయని సంస్థలకు నోటీసులు జారీ చేసి...అప్పటికీ వారు స్పందించకుంటే నీటి సరఫరాను బంద్ చేస్తామని ప్రకటించారు.
శనివారం హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్ల యజమానులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దాన కిషోర్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిబంధనల ప్రకారం రోజూ 50 కిలోల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థలను బల్క్ గార్బెజ్ జనరేటర్లుగా ప్రకటించామని, ఆయా సంస్థలు ఆగస్టు 15వ తేదీలోగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని గతంలో కాలపరిమితి విధించామని వెల్లడించారు. అయితే వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేని నేపథ్యంలో... తాజాగా మరో అవకాశం ఇస్తున్నామని...అయితే మరోసారి గడువు పెంచడం ఉండదని స్పష్టం చేశారు.