టీ-టీడిపిలో వారు ఉంటే కథే వేరుగా ఉండేది..! ఇప్పుడు పార్టీ పగ్గాలు జూనియర్ కా..? బ్రహ్మిణీ కా..?
హైదరాబాద్ : గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారకుండా టిడిపిలోనే ఉండి ఉంటే ఇప్పుడున్న పరిస్థితిలో వారికి మంచి అవకాశాలు దక్కేవేమోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించగా, 21 నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్, టిడిపి నేతలు సమావేశమై నియోజకవర్గాలుగా అప్పటి పోలైన ఓట్లను ఇప్పటి పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం సక్రమంగా అమలు జరిగితే ఫిరాయింపుదారులో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారెవరూ విజయం దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు.
టీటీడిపిలో ఆ ఎమ్మెల్యేలు ఉంటే చక్రం తిప్పేది..! ఐనా 25 స్థానాల్లో గెలుస్తామంటున్న నేతలు..!!
రాబోయే ఎన్నకల్లో టిడిపి 25 స్థానాల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు టిడిపి ఎమ్మెల్యేలు తమకు అపజయం తప్పదేమో అనే ఆందోళనతో ఉన్నారని తెలుస్తోంది. టిడిపి, కాంగ్రెస్, సిపిఐ పొత్తు ఖాయమని, కోదండరామ్ కలసి వచ్చినా, రాకపోయినా, ఆ మూడు పార్టీలు పొత్తుతో పోటీ చేయబోతున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా టిడిపి ద్వారా ఆర్థిక, రాజకీయ లబ్ది పొందిన నాయకులందరికీ రాబోయే ఎన్నికల్లో ఓటర్లు బుద్ది చెప్పబోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో పసి గట్టడం కష్టమే..!
తెలంగాణ పగ్గాలు ఎవరికి..? పార్టీ అదిష్టానం ఎవరివైపు..?
తెలంగాణ టీడీపీకు బలమైన నాయకుడు కావాలి. అందరూ మెచ్చే నేత కావాలి. అదీ నందమూరి కుటుంబం నుంచి వస్తే, ఆదరించేందుకు తెలంగాణా యావత్తూ రెడీగా ఉంది. ఇది ఊకదంపుడు ఉపన్యాసం కాదు. టీడీపీని పొగిడేందుకు కాదు. అక్షరాలా చంద్రబాబు ఎదుట టీడీపీ క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయం. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో చూపిన తెగువ, మాటతీరు, జనాధరణ పొందాయి. ప్రత్యర్థులపై విమర్శలు చేయటంలో, హావభావాలు, అచ్చు తాతను మించాయంటూ ప్రశంసలు అందుకున్నారు జూనియర్. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో జూనియర్ కాస్త మనోవేదనకు గురైనట్టు వార్తలు కూడా వచ్చాయి. దాంతో క్రియాశీల రాజకీయాలకు జూనియర్ కొంత విశ్రాంతి నిచ్చారు.
తెలంగాణలో పార్టీని పట్టాలెక్కించేది ఎవరు..? నాయకత్వమా..? వారసత్వమా...?
ఇక నారా వారి కోడలు, నందమూరి వారసురాలు బ్రహ్మణి.. చిన్న వయసులోనే ఎంతో పరిణితి చెందిన యువతిగా ఆదరాభిమానాలు పొందారు. ఏ మీడియాతో నైనా తడుముకోకుండా తన మనసులోని భావాలను బయటకు చెప్పే సామర్థ్యం ఆమె సొంతం. మీడియాలో తనకు ఎవరూ శత్రువులు లేరంటూ నొర్మొహమాటంగా చెప్పారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. పైగా హెరిటేజ్ వ్యవహారాల్లో కీలక భూమిక కూడా పోషిస్తున్నారు. అటు నందమూరి వారసత్వంగా అబ్బిన నాయకత్వ లక్షణాలు, మరో పక్క చంద్రబాబు రాజకీయ చతురత ఆమెకు అదనపు పరిపక్వతను తీసుకొచ్చాయని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ లేదా బ్రహ్మిణి..! ఎవరికి తెలంగాణ బాద్యతలు..?
వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ పడతారనే ప్రచారం సాగుతోంది. అయితే తనకు మాత్రం రాజకీయాల తెలియవని తేల్చిచెప్పారు. ఆమె కాదన్నా, రక్తంలో వున్న లక్షణాలు ప్రజా జీవితంలోకి చేరగానే అవే సత్తా చాటుతాయంటున్నారు కార్యకర్తలు. అందుకే, తెలంగాణలో టీడీపీ బలపడేందుకు బ్రహ్మణి నాయకత్వం కోరుకుంటున్నారు. అయితే, జూనియర్ పార్టీకి దూరంగా వున్నా, తాను పార్టీ కోసం ఎప్పుడు పని చేస్తూనే ఉంటానని పలుమార్లు చెప్పారు. బ్రహ్మణి, ఎన్నికల వేళ మామ చంద్రబాబు ఎలాంటి బాద్యతను అప్పజెప్పినా, తనవంతు తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో చంద్రబాబునాయుడు ఎవరిని ఎంపిక చేస్తారో, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా సరైన నేతకు బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి.