ఇప్పుడు కాదంటే మరో ఐదేళ్లు.. దూకుడు పెంచితేనే పవర్: కుంతియాతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: 'లంఖణం చేస్తే గానీ ఫలితం ఉండదు' అన్నది నానుడి. దాదాపు నాలుగేళ్ల పాటు విపక్షానికి అందునా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దూకుడుతో అచేతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలకు పరిస్థితి తీవ్రత ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లు తెలుస్తున్నది. కనీసం ఏడాది ముందైనా దూకుడుగా వ్యవహరించాలన్న వాస్తవాన్ని టీపీసీసీ నేతలు గుర్తించినట్లు కనిపిస్తున్నది. ఒకవైపు ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమని పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోదీ 'జమిలి' ఎన్నికల ప్రతిపాదనకు సాక్షాత్ తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలికారు. అధికారంలో ఉండటంతో తిమ్మిని బమ్మిని చేయడానికి ఆస్కారం ఉంటుంది.
కానీ విపక్షంలో అందునా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నా.. నేతలు చురుగ్గా లేకుంటే వారూ ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. గత నాలుగేళ్లుగా నేతలు ప్రకటనలకే పరిమితం అయ్యారు. కొందరు నేతల మధ్య విభేదాలు కూడా ఆ పార్టీకి ఇబ్బందులుగా పరిణమించాయి.
టీపీసీసీ ముఖ్య నేతలతో కుంతియా మంతనాలు
డిసెంబర్, జనవరి నెలల్లోనే లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి కార్యదర్శి రామచంద్ర కుంతియా బుధవారం గాంధీభవన్లో ముఖ్య నాయకులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో విడివిడిగా 20 - 30 నిమిషాల చొప్పున మాట్లాడి వారి సలహాలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. బుధవారం జానారెడ్డి, షబ్బీర్అలీ, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్బాబు, మల్లు రవి తదితర 30 మంది నేతలు, డీసీసీ అధ్యక్షులతో ముఖాముఖి మాట్లాడారు. కుంతియాతో జరిగిన వ్యక్తిగత భేటీల్లో నేతలు తమ వైఖరి కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తున్నది.
60 స్థానాలకు ఇన్చార్జీలను ప్రకటించాల్సిందే
ఇప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కోవాలంటే తక్షణం కార్యక్షేత్రంలోకి దిగాల్సిన అవసరం ఉందని టీపీసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. దూకుడుగా ముందుకు వెళితేనే అధికారం సాధ్యమని, లేదంటే మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందని నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు సహా పలువురు పార్టీ ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ సహా స్పష్టత ఉన్న కనీసం 60 నియోజకవర్గాల్లో వెంటనే ఇన్ఛార్జీలను ప్రకటించాలని, రెండు వారాల్లోపు గ్రేటర్ హైదరాబాద్లోని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించని పక్షంలో రాహుల్గాంధీకి ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నట్టు సమాచారం. ‘ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చురుకుగా స్పందించడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. చాలామంది నేతలు కనీసం వారి నియోజకవర్గాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.' అని కొందరు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇతర పార్టీల నేతల చేరికపై ముందస్తు చర్చలు కావాలి
‘ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు వంటివి చేయడం లేదు. అలాంటి లోపాలు సరిదిద్దుకుంటూ పక్కా ప్రణాళికతో అందర్నీ కలుపుకుంటూ ముందుకెళ్తేనే ఎన్నికల్లో గెలుపు సాధ్యం. లేకుంటే తిరిగి ప్రతిపక్షంలోనే కూర్చోనే పరిస్థితి వస్తుంది' అని మరికొందరు అభిప్రాయపడినట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి పార్టీలో చేర్చుకునే ముందు ఆయా జిల్లాల నేతలతో టీపీసీసీ సంప్రదించాలని కొందరు కుంతియాను కోరారు. ఇటీవల కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇతర పార్టీల నేతల చేరికల అంశాన్ని సంబంధిత జిల్లాల నేతలకు తెలియకుండా దాటవేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టీపీసీసీ సమావేశం జరుగుతుండగానే హైదరాబాద్ పరిధిలోఒక నేత చేరిక గురించి ఏర్పాటు చేసిన సభలోనే మహబూబ్ నగర్ జడ్పీటీసీ చేరిక సంగతి సంబంధిత జిల్లా ఎమ్మెల్యే, సీనియర్ నేత డీకే అరుణకు తెలియలేదని వార్తలు వచ్చాయి. ఇటువంటి అనుభవాలు భారీగానే ఉన్నట్లు తెలుస్తున్నది.
ఎన్నికల వ్యూహం అమలుపైనే టీపీసీసీ నేతలతో చర్చలు
అందరి అభిప్రాయాలు తెలుసుకున్న కుంతియా తమ అభిప్రాయాలు, సూచనలను రాత పూర్వకంగా ఇవ్వాలని కొందరికి సూచించినట్లు తెలిసింది. సీఎల్పీ ఉపనేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు 38 నెలల తర్వాత బుధవారం గాంధీభవన్కు వచ్చారు. కుంతియా అభ్యర్థన మేరకే తాను గాంధీభవన్కు వచ్చినట్లు ఆయన చెప్పారు. రాజకీయ సమీకరణలు, వచ్చే ఎన్నికల్లో పొత్తులు, కేసీఆర్ ఇస్తున్న హామీల వలలో ప్రజలు పడకుండా చూడటంతోపాటు వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి ప్రణాళిక రచించాలి? రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాలు, బస్సు యాత్రలు, ప్రచార సభలు ఎలా నిర్వహించాలి? అనే అంశాలతోపాటు తెలంగాణ నుంచి ఏఐసీసీలో ఎవరెవరికి ప్రాధాన్యం కల్పించాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ సాగినట్టు తెలిసింది. వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, పీసీసీ అధ్యక్షుడితో విభేదాలేమైనా ఉన్నాయా? తదితర అంశాలను వాకబు చేసినట్లు సమాచారం.