ఢిల్లీని యాచించం, శాసిస్తాం : ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కేటీఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఇంకా కొన్ని గ్రామాలకు తాగునీరు, విద్యుత్, రహదారి లేవని, ఆ పాపం ఈ పార్టీలదీ కాదా అని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్: తెలంగాణలో 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు
ఉద్యమ నేత .. ఉత్తమ పాలకుడు
ఉద్యమ నేత కేసీఆర్ ఉత్తమ పాలకుడన్నారు కేటీఆర్. ఈ అంశం ఇటీవల చేసిన మరో సర్వే రుజువు చేసిందని గుర్తుచేశారు. దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై చేపట్టిన సర్వేలో కేసీఆర్ మొదటిస్థానంలో నిలిచారని పేర్కొన్నారు. కేసీఆర్ పనితీరుపై 70 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు తేలిందని .. ఇది తెలంగాణ రాష్ట్రంలో పాలనకు సాక్షిభూతంగా నిలుస్తోందన్నారు. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి .. ప్రజల దీవెనలతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి సంక్షేమం కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
రీజనల్ పార్టీలదే హవా
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే ఆ పార్టీలకే లాభం జరుగుతుందన్నారు కేటీఆర్. అదే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే .. తెలంగాణ ప్రాంతానికి మంచి జరుగుతోందన్నారు. దేశంలో 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జాడ లేదని గుర్తుచేశరాయన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.
ఢిల్లీని యాచించం, శాసిస్తాం
లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్నారు కేటీఆర్. ఎన్డీఏ కూటమికి 150, కాంగ్రెస్ కూటమికి 100 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రాంతీయ పార్టీల మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తే .. కూటమికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతారని చెప్పారు. అప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు మరింత సంక్షేమ ఫలాలు అందించడం వీలవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే విజయమని, దీంతో తాము ఢిల్లీని యాచించమని శాసిస్తామని పేర్కొన్నారు కేటీఆర్.