ఆన్ రికార్డ్: పాకిస్తాన్ నుంచి వచ్చి తెలంగాణ నివసించినా ఎవ్వరూ వెనక్కి పంపరు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో శేరి లింగంపల్లికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చి తెలంగాణ నివసించినప్పటికీ.. ఎవ్వరూ వెనక్కి పంపించబోరని తేల్చి చెప్పారు.
Recommended Video
అరికెపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనను కలిసిన ముస్లిం ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా గాంధీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సుముఖంగా లేరని, అవసరమైతే ఈ విషయాన్ని బహిరంగ సభ నిర్వహించి ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు.
పాకిస్తాన్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు తెలంగాణలో నివసించవచ్చని చెప్పారు. అలా వచ్చిన వారికి అడ్రస్ లేకపోయినప్పటికీ.. ఎవ్వరూ వెనక్కి పంపబోరని, అలాంటి పరిస్థితి రాదని, ఎవ్వరూ భయపడొద్దని స్పష్టం చేశారు. అలా వెనక్కి పంపించాల్సి వస్తే.. తాము అడ్డుకుని తీరుతామని,అరికెపూడి గాంధీ చెప్పారు. కొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వచ్చి సర్వే చేయనున్నారని, అలాంటి వారిని అడ్డుకోవాలని ఆయన ముస్లిం ప్రతినిధులకు సూచించారు.
ఆన్ రికార్డ్: పాకిస్తాన్ నుంచి వచ్చి తెలంగాణ నివసించినా ఎవ్వరూ వెనక్కి పంపరు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే #TRS #ArikepudiGandhi #CitizenshipAmendmentAct #Pakistan #Telangana Telangana pic.twitter.com/Tud3BVwnlI
— Oneindia Telugu (@oneindiatelugu) February 27, 2020
పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవానికి బీజేపీ కార్యకర్తలు ఇటీవలే హఫీజ్పేట్లో సర్వే చేపట్టారని, ఇప్పుడు ఆల్విన్ కాలనీలో సర్వే చేస్తున్నారని, ఈ చట్టం మంచిదంటూ మోసపూరతి మాటలు చెబుతున్నారని అన్నారు. అలాంటి వారి మాయలో పడొద్దని హెచ్చరించారు. అలా అంతర్గత సర్వే చేస్తోన్న వారిని వెల్లగొట్టడంలో తప్పులేదని చెప్పారు. ఇబ్బందులు వస్తే బీజేపీ నాయకులు ఎవ్వరూ అండగా ఉండబోరని, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు మాత్రమే ప్రజలకు క్షేత్రస్థాయిలో అండగా ఉంటారని అన్నారు. ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్లకు బీజేపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.