అధికారం మీ చేతుల్లోనే.. చెక్ పవర్ గోల ఎందుకు.. సర్పంచులపై మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంతటివారిపైనైనా సరే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సర్పంచులు తప్పుచేసినా ఊరుకోబోమని తేల్చిచెప్పారు. బుధవారం ములుగు జెడ్పీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని రవీందర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ములుగు జెడ్పీ చైర్మన్గా జగదీశ్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. పల్లెలే పట్టుగొమ్మలనే గాంధీ నినాదాన్ని ఉచ్చరించారు. గ్రామాల్లో తప్పు చేస్తే ఉపేక్షించబోమన్నారు. ఒకవేళ సర్పంచ్ తప్పుచేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడానికి గ్రామా అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇదివరకు ఉన్న జిల్లా పాలకవర్గాకు అధికారం, నిధులు ఏవీ లేకుండా పోయాయని .. అందుకే గ్రామీణ పాలన దెబ్బతిందని కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు ఇవ్వదు కానీ .. అధికారం చెలాయిస్తుందని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థలో ఇది సరికాదని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాభివృద్ధి కమిటీ, జిల్లా పరిషత్లకు అధికారాలు ఇచ్చిందని గుర్తుచేశారు. సర్పంచ్, ఎంపీపీలకు కూడా నిధులిస్తోందని పేర్కొన్నారు. దీంతో స్థానిక సంస్థల ప్రతినిధుల చేతిలోకి పాలన వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. అధికారం మీ చేతుల్లో ఉండగా .. ఇంకా చెక్ పవర్ పై ఎందుకు గొడవ చేస్తున్నారని సర్పంచులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు తప్పుచేస్తే ఉపేక్షించబోమని కుండబద్దలు కొట్టారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరినీ ఉపేక్షించబోమని .. తరతమ బేధాలు చూపించబోమన్నారు.