మద్యం తాగితే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట వినదు..! యంత్రం కనిపెట్టిన కోరుట్ల కుర్రాడు..!!
కోరుట్ల/ హైదరాబాద్ : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..! మీరు మద్యం సేవిస్తే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట వినదు. ఔను.. మీరు చదువుతుంది నిజమే..! మీరు మోతాదుకు మించి మద్యం తాగితే మీ కారు కూడా మిమ్మల్ని బయటకు గెంటేస్తుంది. మద్యం సేవించి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఇక మీ కారు మొరాయించి ఎంతకూ స్టార్ట్ అవ్వదు. ఇదే అత్యంత అదునాతన సాంకేతికత. మద్యం సేవించి కారు నడుపుతూ ప్రాణాలమీదకు తెచ్చకుంటున్న యువతకు మన కోరుట్ల కుర్రాడు విరుగుడు కనిపెట్టాడు. తాగితే అసలు కారే కదలకపోతే ఎలాంటి అనర్థాలు ఉండవుకదా అని ఆలోచించిన ఆ కుర్రడు ఇలాంటి పరికరాన్ని కనిపెట్టాడు.
వినూత్న ప్రయోగంతో జగిత్యాల జిల్లా కోరుట్ల యువకుడు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మద్యం తాగి కారు నడిపేందుకు ప్రయత్నిస్తే ఇంజిన్ అక్కడికక్కడే ఆగిపోయే యంత్రాన్ని కోరుట్లకు చెందిన 22 ఏళ్ల సిరిపురం సాయితేజ రూపొందించారు. హైదరాబాద్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయితేజ తాను తయారు చేసిన యంత్రం గురించి వివరించారు. ఇది వీక్షించిన పలువురు ప్రముఖులు తనను ప్రశంసించారని సాయితేజ తెలిపారు.
ప్రధాని కార్యాలయం నుంచి తనకు ఫోన్కాల్ వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని చెప్పారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, టాలీవుడ్ హీరో సాయిధరమ్తేజ్ తదితరులు ప్రశంసించారని వెల్లడించారు. ''తెలంగాణకు చెందిన కుర్రవాడు మరిన్ని ఆవిష్కరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది. సాయితేజకు అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించా'' అని కేటీఆర్ ట్విటర్లో పేర్కొనడం విశేషం..!