నేడే నాగుల చవితి..! పాములకు పాలు పోస్తే శిక్ష తప్పదు సుమీ..!!
Recommended Video
హైదరాబాద్ : సోమవారం నాగుల చవితి పర్వదినం కాగా, మహిళలు నాగదేవతకు పూజలు చేస్తారు. ఇందులో భాగంగా పాములకు పాలు పోస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ ఆ పాలే పాములకు విషంగా మారి వాటి చావుకు కారణమవుతోంది. పాములు సరీస్పపాలు కావున అవి పాలు తాగవు అలానే గుడ్లు తినవని నిపుణులు అంటున్నారు. ఇవేమీ తెలియక ప్రజలు భక్తి భావంతో పాములకు పాలు ఆహారంగా ఇచ్చి వాటి మరణానికి కారణమవుతున్నారు.
పాలు సర్పాల జీర్ణవ్యవస్థకు భిన్నమైనవి కావడంతో అవి మృత్యువాతపడుతున్నాయి. పాములకు పాలు పోస్తే మంచి జరుగుతుందనే అపోహ కారణంగా నగరంలో ఏటా వందలాది పామలు మృత్యువాత పడుతున్నాయని స్నేక్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు, పక్షులు, తదితర వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం కోసం కృషి చేస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టూ ఎనిమిల్స్ (జీహెచ్ఎస్పీఎస్ఏ), పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ (పీఎఫ్ఏ) తదితర సంస్థలు 'పాలు పోయొద్దు పాముల ప్రాణాలు తీయొద్దు' అనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నాయి.
ఇదే పాములు పట్టేవాళ్లకు ఉపాధిగా మారింది. వారు పాముల తలను బంధించి కోరలు కత్తిరించి, అనంతరం విషపు గ్రంధులను తొలగిస్తున్నారు. తరువాత వాటిని బుట్టల్లో బంధించి చీకటి గదిలో ఉంచుతారు. వాటికి నీళ్లు, ఆహారం లేకుండా రోజుల తరబడి ఉండడంతో పాములు నాగపంచమి నాటికి పూర్తిగా జీవచ్ఛవాలుగా మారిపోతాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూంటాయి. అలాంటి పాములను బుట్టల్లో వేసుకొని ఇల్లిల్లూ తిరుగి సొమ్ము దండుకుంటారు. అయితే అప్పటి వరకు ఎలాంటి ఆహారం లేకుండా ఆకలితో ఉన్న పాములు ఈ పాలను తాగేందుకు ప్రయత్నిస్తాయి.
కానీ పాలు వాటికి ఆహారం కాకపోవడంతో ఒకటి రెండు రోజుల్లోనే అది మృత్యువాత పడుతున్నాయి. వీటితో ఏటేటా పాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే పాములు తినే సహజ ఆహారానికి విరుద్దంగా ఏ ఆహారం పెట్టినా తట్టుకునే శక్తి వాటికి ఉండకపోవడంతో అవి తొందరగా మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే నాగుల చవితి రోజు వాటికి పాలతో పాటు ఎలాంటి తిను పదార్థాలు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు వణ్యప్రాణి సంరక్షణా అదికారులు.