హైద్రాబాద్లో ల్యాండివ్వండి: సిటీలో ఐకియా కాంప్లెక్స్
హైదరాబాద్: ప్రపంచ ప్రసిద్ధ గృహోపకరణాల తయారీ సంస్థ ఐకియా హైదరాబాద్లోని రాయదుర్గంలో రూ.600 కోట్లతో ఇంటర్నేషనల్ లెవల్లో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 16 ఎకరాలను ఎంపిక చేసింది. ఈ భూమిని తమకు మార్కెట్ ధరకు కేటాయించాలని, ఎలాంటి రాయితీలు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు ఐకియా లేఖ రాసింది.
దీంతో పాటు వరంగల్లో చేనేత తివాచీల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, దీనికి అవసరమైన భూమిని కేటాయించాలని కోరింది. ఈ విజ్ఞప్తికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అంగీకరించింది. తమ పరిధిలోని 16 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. వరంగల్లోను భూమిని ఎంపిక చేశాక కేటాయిస్తామని తెలిపారు.
జెన్కో ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేస్తాం
జెన్కో తలపెట్టిన ఆరువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు కేంద్రాలను సకాలంలో పూర్తిచేసేందుకు ఇంజనీర్లమంతా పట్టుదలతో శ్రమిస్తామని సీఎండీ ప్రభాకర్రావు నేతృత్వంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషిచేస్తామని తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్ల రాష్ట్ర సంఘం (టీ-స్టేట్పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్)అధ్యక్షులు సుధాకర్ రావు అన్నారు.
ఖమ్మం జిల్లా మణుగూరులో విద్యుత్ కేంద్రం నిర్మాణం జరగనున్న ప్రదేశాన్ని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నెహ్రూ, ఎన్ భాస్కర్ మంగళవారం పరిశీలించారు. మణుగూరు థర్మల్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని ఇంజనీర్లు పేర్కొన్నారు.