పెద్దమ్మ కూతురితో.. అన్న భార్యతో వివాహేతర సంబంధం, దారుణ హత్య
రాత్రి సమయంలో టాటా సుమాలో మృతదేహాన్ని తీసుకొచ్చి.. బెడ్రూమ్ లో గొయ్యి తీసి అందులోనే శవాన్ని పూడ్చిపెట్టారు. మరుసటి రోజు సయీద్ దుబాయ్ వెళ్లిపోయాడు.
హైదరాబాద్: వావి వరుసలు మరిచిన ఓ వ్యక్తి.. సొంత పెద్దమ్మ కూతురితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అన్న భార్యతో సైతం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి అతగాడి వేధింపుల పర్వం యువతి సోదరుడికి తెలియడంతో ప్లాన్ ప్రకారం అతన్ని మట్టుబెట్టారు.
హైదరాబాద్ లోని ఫతేదర్వాజాలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికుడైన సయ్యద్ ఇమ్రాన్(35) అబుదాబిలోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబిలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఉన్నతోద్యోగం.. చేతినిండా డబ్బు.. అతన్ని విచ్చలవిడితనం వైపు దారి తీయించింది.
పెద్దమ్మ కుటుంబానికి దగ్గరయ్యి..
అబుదాబి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి భారీ బహుమతులతో చాంద్రయాణగుట్టలో ఉంటున్న పెద్దమ్మ ఇంటికి వెళ్లి వారిని ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని పెద్దమ్మ ఇంటికి రాకపోకలు సాగించి.. ఆ ఇంట్లో వారితోనే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు.
పెద్దమ్మ పెద్ద కుమార్తెతో పాటు, ఆమె కుమారుడి భార్యతోను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కుమారుడు సయీద్ ఖతర్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇమ్రాన్ వ్యవహారం సయీద్ సోదరుడు సైఫ్(22) కు తెలిసింది.
సయీద్ కు తెలియడంతో అంతం చేయాలని..
దీంతో ఇమ్రాన్ వ్యవహారాన్ని ఖతర్ లో ఉంటున్న సోదరుడు సయీద్ కు ఫోన్ ద్వారా వివరించాడు. అవివాహిత అయిన తమ సోదరిని ఇమ్రాన్ వేధిస్తుండటంతో ఇద్దరు కలిసి అతన్ని అంతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
ఇమ్రాన్ హైదరాబాద్ లో అడుగుపెట్టాడన్న విషయం తెలుసుకుని అతన్ని హత్య చేయడం కోసం సయీద్ కూడా ఖతర్ నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. సైఫ్, సయీద్ ఇద్దరు కలిసి ఇమ్రాన్ హత్య కోసం పక్కా ప్లాన్ వేశారు. ఇందుకోసం బండ్లగూడలోని ఫరూఖ్ నగర్ లో ఓ ఇంటినే అద్దెకు తీసుకున్నారు.
ప్లాన్ ఇలా అమలు చేశారు:
సయీద్ తన భార్య ఫాతిమాతో ఫోన్ చేయించి ఇమ్రాన్ ను పిలిపించాడు. ఫలక్ నుమా రైతు బజార్ కు వచ్చిన ఇమ్రాన్ ఫాతిమాతో కలిసి ఫరూఖ్ నగర్ లోని ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాచుకుని కూర్చొన్న సయీద్, సైఫ్ ఇద్దరు కత్తులతో దాడి చేసి ఇమ్రాన్ ను హతం చేశారు.
బెడ్రూమ్ లో పూడ్చి పెట్టి:
ఫరూఖ్ నగర్ ఇంట్లో ఏమాత్రం హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసి.. అనంతరం మృతదేహాన్ని చాంద్రయాణ గుట్టలో నిర్మాణంలో ఉన్న తమ ఇంటికి తరలించారు. ఇందుకోసం స్నేహితుడు హాశం అలీ సహాయం తీసుకున్నారు.
రాత్రి సమయంలో టాటా సుమాలో మృతదేహాన్ని తీసుకొచ్చి.. బెడ్రూమ్ లో గొయ్యి తీసి అందులోనే శవాన్ని పూడ్చిపెట్టారు. మరుసటి రోజు సయీద్ దుబాయ్ వెళ్లిపోయాడు.
పోలీసులకు ఎలా తెలిసింది?..
ఇమ్రాన్ ఫలక్ నుమా రైతు బజార్ వద్ద ఫాతిమాను కలవడానికి వెళ్లిన సమయంలో స్నేహితుడు సర్వర్ ను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఆమెతో ఫోన్ మాట్లాడుతున్న సమయంలోను సర్వర్ ఇమ్రాన్ పక్కనే ఉన్నాడు. ఫాతిమా అక్కడికి రాగానే సర్వర్ ను ఇమ్రాన్ అక్కడినుంచి పంపించేశాడు.
రాత్రయినా ఇమ్రాన్ ఇంటికి రాకపోవడంతో ఇమ్రాన్ తల్లి సర్వర్ ను ప్రశ్నించింది. దీంతో ఫాతిమాను కలవడానికి వెళ్లిన విషయాన్ని ఆమెకు వివరించాడు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది.
ఇలా పట్టుకున్నారు..
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇమ్రాన్ ఫాతిమాతో వెళ్లినట్టు పోలీసులు నిర్దారించుకున్నారు. ఇతర సాంకేతికాంశాలను పరిశీలించి గురువారం ఉదయం అతను హత్యకు గురైనట్టుగా గుర్తించారు. సయీద్, సైఫే నిందితులు అని నిర్దారించుకుని.. సాయంత్రానికి సైఫ్, అతనికి సహకరించిన హాశంలను అరెస్టు చేశారు. ఫాతిమా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దుబాయ్ వెళ్లిపోయిన సయీద్ కోసం పోలీసులు ఎల్ఓసీ జారీ చేసే అవకాశముంది.